వేసవి సెలవులకు వెళ్లి.. అనంత లోకాలకు
ABN , Publish Date - May 23 , 2024 | 11:34 PM
వేసవి సెలవులకు చిన్నమ్మ ఇంటికి వెళ్లిన బాలిక కారు(బొలెరో) ఢీకొని మృతిచెందిన సంఘటన షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం గ్రామ పంచాయతీ పెద్దయ్యగడ్డ తండాలో గురువారం చోటుచేసుకుంది.
కారు రివర్స్ తీస్తుండగా ఢీకొని బాలిక దుర్మరణం
షాద్నగర్ రూరల్, మే 23: వేసవి సెలవులకు చిన్నమ్మ ఇంటికి వెళ్లిన బాలిక కారు(బొలెరో) ఢీకొని మృతిచెందిన సంఘటన షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం గ్రామ పంచాయతీ పెద్దయ్యగడ్డ తండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తూరు మండలం కొడిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని గాజీగూడ తండాకు చెందిన కావ్య(16) ఇటీవల 9వ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం ఆమె చిన్నమ్మ పెద్దయ్యగడ్డ తండాలోని ఇంటికి తీసుకెళ్లింది. గురువారం తిరిగి ఆ బాలిక సొంతూరుకు వెళ్లాల్సి ఉండగా.. చిన్నమ్మ కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో శుక్రవారం తీసుకెళ్తానని చెప్పింది. ఈక్రమంలో ఇంటి బయట కావ్య నిలిచి ఉండగా తండాకు చెందిన సీతారాం నాయక్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న బొలెరో వాహనాన్ని వేగంగా రివర్స్ తీశాడు. దాంతో కావ్యకు బలంగా తగిలి కిందపడి పోయింది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రతా్పలింగం తెలిపారు.