అక్రమంగా మట్టి తవ్వకాలు
ABN , Publish Date - May 22 , 2024 | 11:36 PM
మండల పరిధిలోని బైర్కాన్పల్లి గ్రామ శివారులోని పో సముద్రంలో నుంచి కొందరు అక్రమంగా మట్టిని తవ్వుకుని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమ దందాకు తెరలేపారు.
హిటాచీని సీజ్ చేసిన పోలీసులు
కేశంపేట, మే 22: మండల పరిధిలోని బైర్కాన్పల్లి గ్రామ శివారులోని పో సముద్రంలో నుంచి కొందరు అక్రమంగా మట్టిని తవ్వుకుని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమ దందాకు తెరలేపారు. వివరాల్లోకి వెళితే.. సర్వే నెంబర్ 52, 53లలో పో సముద్రం చెరువు ఉంది. ఇందులో సర్వే నెంబర్ 52లో కొంతమేర పట్టాభూమి ఉంది. ఇది ఎఫ్టీఎల్లో ఉంటుంది. అయితే, కొత్తూర్ మండలం సిద్దాపూర్కు చెందిన కొందరు అక్రమార్కులు పోలీసు ఉన్నతాధికారుల పేరును ఉపయోగించుకొని మట్టి అక్రమ రవాణాకు తెరలేపారు. బుధవారం పో సముద్రంలో నుంచి మట్టిని టిప్పర్లతో తరలిస్తున్నరన్న సమాచారంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే అక్కడి నుంచి టిప్పర్లను తరలించారు. మట్టిని తోడిన హిటాచీ అక్కడే ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. అయితే, అక్రమ మట్టి వ్యాపారులు రెవెన్యూ, పోలీసులతో పాటు జర్నలిస్టులను బెదిరింపులకు గురిచేశారు. ఓ పోలీసు ఉన్నతాధికారికి చెందిన భూమి అని.. మీరు ఎవ్వరూ ఏమీ చేయలేరని బెదిరించారు. కేశంపేట పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు.