ముచ్చింతల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:51 PM
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్లో శ్రీరామనగరం దివ్యసాకేతాన్ని సందర్శించారు.
చినజీయర్ ఆశీస్సులు తీసుకున్న మోహన్ భగవత్
శంషాబాద్ రూరల్ జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్లో శ్రీరామనగరం దివ్యసాకేతాన్ని సందర్శించారు. ప్రముఖ అధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం 9.30 గంటలకు దివ్యసాకేతానికి చేరుకున్న మోహన్ భగవత్కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చినజీయర్తో కలిసి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దాదాపు 40 నిమిషాలు చినజీయర్తో సమావేశమయ్యారు. స్వామీజీ ఆశీస్సుల కోసమే మోహన్ భగవత్ ఆశ్రమానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్కు మంగళశాసనాలు, తీర్థప్రసాదాలు అందించినట్లు స్వామిజీ తెలిపారు. ఆలయంలో వేదపండితులు ఆర్ఎస్ఎస్ చీఫ్కు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మోహన్ భగవత్కు చిన జీయర్స్వామి వేంకటేశ్వరుడు, సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడి ప్రతిమలను అందజేశారు.