వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:52 PM
ఏడు నెలలుగా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం లేక రైతులకు అందాల్సిన సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇ
త్వరలో కొలువుదీరనున్న మహేశ్వరం మార్కెట్ కమిటీ పాలకవర్గం
ఎస్టీ జనరల్కు కేటాయించడంతో ఆశావహుల ముమ్మర యత్నాలు
కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం
నువ్వా-నేనా అనేలా.. కృష్ణానాయక్, రాజునాయక్
మహేశ్వరం, జూలై 26 : ఏడు నెలలుగా మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం లేక రైతులకు అందాల్సిన సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇటు పాలకవర్గం లేకపోవడంతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. త్వరగా ఏర్పాటు చేయాలని మహేశ్వరం, కందుకూరు మండలాల రైతులు మహేశ్వరం కాంగ్రెస్ ఇన్చార్జి కేఎల్ఆర్తో పాటు పలువురు నేతలను ఆశ్రయిస్తున్నారు. పాత కమిటీలను ప్రభుత్వం రద్దు చేయడంతో నూతన కమిటీ ఏర్పాటు కాకపోవడంతో వ్యవసాయ మార్కెట్కమిటీ పాలన గందరగోళంగా తయారైంది. అదేవిధంగా మహేశ్వరం మార్కెట్ కమిటీ రిజర్వేషన్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2015-16లోనే 5 విడతలుగా ఒకేసారి లాటరీ పద్దతిన ప్రకటించారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ నుంచి 2015లో విడిపోయి నూతనంగా ఏర్పాటైన మహేశ్వరం మార్కెట్కమిటీకి రెండు పర్యాయాలు జనరల్ మహిళ, మూడో విడత జనరల్, నాలుగో విడత ఎస్టీ జనరల్, ఐదో విడత జనరల్ మహిళకు రిజర్వేషన్లను కేటాయించారు. ప్రస్తుతం కొలువుదీరనున్న మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్టీ జనరల్కు రిజర్వేషన్ కావడంతో కందుకూరు, మహేశ్వరం మండలాలకు చెందిన అధికార పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ ఎంతో కాలంగా పార్టీ కోసం తాము చేసిన కృషిని వివరిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు.
మూడు విడతలూ కందుకూరుకే..
మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీని 2015-16 లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మూడు విడతలుగా కందుకూరు మండలానికి చెందిన నేతలకే కేటాయించడంతో ఈసారి మహేశ్వరం మండలానికి చెందిన నాయకులకే చైర్మన్ పదవి వరించనుంది. కాగా, మహేశ్వరం మండలానికి చెందిన పలు గ్రామాల గిరిజన కాంగ్రెస్ నేతలు చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
రేసులో ఉన్న గిరిజన నేతలు
మహేశ్వరం మండలానికి చెందిన ఆంగోత్ కృష్ణానాయక్, నేనావత్ రాజునాయక్, పాండునాయక్, అంద్యానాయక్, రాములునాయక్లు, కందుకూరు మండలం నుంచి ఆంజనేయులునాయక్, లచ్చానాయక్, కృష్ణానాయక్లు చైర్మన్ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. మహేశ్వరం మండలానికి చెందిన కృష్ణానాయుయక్, రాజునాయక్లు చైర్మన్ పదవి కోసం నువ్వా, నేనా అనే రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు.