10 నుంచి ఖమ్మంలో ‘ప్రజా రచయిత్రుల వేదిక’ రాష్ట్ర మహాసభలు
ABN , Publish Date - Jan 28 , 2024 | 03:29 AM
స్త్రీలపై ట్రోలింగ్ సమస్య ఎజెండాగా ప్రజా రచయిత్రుల వేదిక(ప్రరవే) 17వ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలోని వేదిక ఫంక్షన్హాల్లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో జరుగనున్న విషయం విదితమే.
ఏర్పాట్లను పరిశీలించిన సంఘం రాష్ట్ర నేతలు
ఖమ్మం సాంస్కృతికం, జనవరి 27 : స్త్రీలపై ట్రోలింగ్ సమస్య ఎజెండాగా ప్రజా రచయిత్రుల వేదిక(ప్రరవే) 17వ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలోని వేదిక ఫంక్షన్హాల్లో ఫిబ్రవరి 10, 11 తేదీల్లో జరుగనున్న విషయం విదితమే. ఈ సభల ఏర్పాట్లను ‘ప్రరవే’ రాష్ట్ర నాయకులు కాత్యాయిని విద్మహే, కేఎన్ మల్లీశ్వరి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు నగరంలోని సాహితీవేత్తలు మువ్వా శ్రీనివాస్, రవి మారుత్తో పాటు కవయిత్రులు, మహిళా సంఘాల నేతలతో సన్నాహాక సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ‘స్ర్తీలపై ట్రోలింగ్ నిర్వచనం, మూలాలు, వర్తమానం’ అంశంపై వీక్షణం మాసపత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, ‘ట్రోలింగ్ అంతర్జాతీయ, జాతీయ కళారంగాలు’ అనే అంశంపై ప్రొఫెసర్ కె.సునీతారాణి, ‘ట్రోలింగ్ సామాజిక రాజకీయ రంగాలు’ అనే అంశంపై ప్రముఖ స్త్రీవాద కవి కొండేపూడి నిర్మల, ‘ట్రోలింగ్ సాంస్కృతిక, కళారంగాలు’ అనే అంశంపై సామాజిక కార్యకర్త కృష్ణకుమారి ప్రసంగిస్తారని తెలిపారు. ప్రశ్నించే స్త్రీల అనుభవాలతో ముద్రించిన ట్రోల్ పుస్తకాన్ని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ఆవిష్కరిస్తారని తెలిపారు. ‘నారి సారించిన నవల’ పుస్తకంపై విమర్శకురాలు విమల, శీల సుభద్రాదేవి, శిలాలోలిత ప్రసంగిస్తారని తెలిపారు.