టూరిజం కార్పొరేషన్ ఎం.డి.పై సస్పెన్షన్ కొనసాగుతోంది
ABN , Publish Date - Jan 09 , 2024 | 04:42 AM
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఎలక్షన్ కమిషన్ చర్యలకు గురైన టూరిజం డెవల్పమెంట్ కార్పొరేషన్ ఎం.డి. బోయిన్పల్లి మనోహర్రావుపై సస్పెన్షన్ కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
అప్పీలుకు అవకాశం ఇస్తూ విచారణ వాయిదా
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఎలక్షన్ కమిషన్ చర్యలకు గురైన టూరిజం డెవల్పమెంట్ కార్పొరేషన్ ఎం.డి. బోయిన్పల్లి మనోహర్రావుపై సస్పెన్షన్ కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించింది. మనోహర్రావును ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయగా, దాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే సస్పెన్షన్ను ఎత్తివేయాలా, కొనసాగించాలా అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంతో హైకోర్టు ప్రశ్నించింది. వారంరోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే సంబంధితశాఖ ముఖ్యకార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది కూడా. సోమవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ సస్పెన్షన్ను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిర్ణయంపై పిటిషనర్ అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంటూ విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.