మోదీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం
ABN , Publish Date - Apr 30 , 2024 | 04:18 AM
ప్రస్తుతం జరిగే ఎన్నికలు ప్రమాదకరమైనవిగా భావించాలని, మోదీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ యోగేంద్ర
ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్
హుస్నాబాద్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జరిగే ఎన్నికలు ప్రమాదకరమైనవిగా భావించాలని, మోదీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. రెండుసార్లు ప్రధానిగా ఎన్నికైన మోదీ ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు, విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలు సంఘటనలను ఉదహరించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.