. నేడే ఆఖరు!
ABN , Publish Date - Feb 28 , 2024 | 10:05 PM
అర్హులకే రేషన్ సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషన్ కార్డుల్లో నమోదైన నకిలీ లబ్ధిదారులను ఏరివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రేషన్ లబ్దిదారులకు ఈ-కేవైసీ నమోదు చేయడం ద్వారా నకిలీలకు చెక్ పెట్టనున్నారు.
నేటితో ముగియనున్న రేషన్ కార్డుకు ఈకేవైసీ
రేషన్ డీలర్లు అందుబాటులో లేని చోట్ల మందకొడిగా ఎంట్రీ
మేడ్చల్-మల్కాజ్గిరిలో 90శాతం, వికారాబాద్ జిల్లాలో 80 నమోదు
ఈ - కేవైసీ చేసుకోకపోతే వచ్చే నెల నెంచి రేషన్ కట్?
వికారాబాద్/మేడ్చల్ ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): అర్హులకే రేషన్ సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషన్ కార్డుల్లో నమోదైన నకిలీ లబ్ధిదారులను ఏరివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రేషన్ లబ్దిదారులకు ఈ-కేవైసీ నమోదు చేయడం ద్వారా నకిలీలకు చెక్ పెట్టనున్నారు. రేషన్ కార్డుల్లో నమోదైన లబ్ధిదారుల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఇప్పటికే గడువును రెండు పర్యాయాలు పొడిగించిన ప్రభుత్వం ఈనెల 29వ తేదీ వరకు గడువు పొడిగించింది. రేషన్ లబ్దిదారులు ఈ -కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం రెండు పర్యాయాలు గడువు పొడిగించినా. ఈసారి కూడా పూర్తి స్థాయిలో ఈ-కేవైసీ నమోదుకు దూరంగానే ఉంది. జిల్లాలో 588 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2,41,185 రేషన్ కార్డులు ఉండగా, 8.09 లక్షల మంది మంది రేషన్సరుకులు పొందుతున్నారు. ఆహార భద్రతా కార్డులు 2,14,284 ఉండగా, అంత్యోదయ 26,865, అన్నపూర్ణ కార్డులు 36 ఉన్నాయి. ఈ కార్డుదారుల్లో ఇప్పటి వరకు 1,92,.948 రేషన్కార్డుల్లో నమోదైన లబ్ధ్దిదారులు తమ వేలిముద్రలు నమోదు చేసుకోగా, ఇంకా 48,237 రేషన్కార్డుల్లో నమోదైన లబ్ధ్దిదారులు తమ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 80 శాతం మాత్రమే ఈ కేవైసీ పూర్తయింది. మేడ్చల్-మల్కాజ్గిరిజిల్లాలో ఇప్పటికీ 90 శాతం రేషన్కార్డుకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. . జిల్లా వ్యాప్తంగా 5,23,938 ఆహారభద్రత కార్డులు, 17,18,351 మంది సభ్యులుండగా 90 శాతం మందివి వేలిముద్రలు తీసుకున్నారు.
ఆలస్యానికి ప్రచార లోపం కారణం
జిల్లాలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన రేషన్దారుల ఈ-కేవైసీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రచార లోపం కారణంగా రేషన్ కార్డు లబ్ధిదారుల వేలి ముద్రల నమోదు ప్రక్రియ సజావుగా ముందుకు కొనసాగడం లేదు. వృద్ధుల వేలి ముద్రలు కూడా సక్రమంగా నమోదు కావడం లేదు. అర్హులై ఉండి వేలి ముద్రలు (ఈ కేవైసీ) నమోదు కాని వారి వివరాలను నమోదు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తూ జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీసీఎ్సవో, టీఎ్ససీ ఎస్సీఎల్ జిల్లా మేనేజర్ అర్హులను గుర్తించి నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వృద్ధ్దులు, దివ్యాంగులు కదలలేని పరిస్థితుల్లో ఉంటే డీలర్లు వారి ఇంటికి వచ్చి ఈ కేవైసీ చేయనున్నారు.
దూర ప్రాంతాల్లో లబ్ధ్దిదారులు
ప్రతి రేషన్ దుకాణం పరిధిలో 10 నుంచి 20 శాతం మంది వరకు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. స్థానికంగా అందుబాటులో లేని ఇలాంటి వారు ఈ కేవైసీ నమోదుకు దూరంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తాము సరుకులు తీసుకునే డీలర్ వద్ద వేలిముద్రలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. రేషన్ డీలర్లు అందుబాటులో లేక కొన్నిచోట్ల ఈ ప్రక్రియ మందకోడిగా కొనసాగుతోంది. అవగాహన కల్పించకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. రేషన్కార్డుకు ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే బియ్యం సరఫరా నిలిచిపోనుంది.