టీఎస్ ‘బైపాస్’!
ABN , Publish Date - Feb 26 , 2024 | 05:41 AM
భవన నిర్మాణ అనుమతులు వేగవంతంగా, పారదర్శకంగా ఆన్లైన్లోనే ఇచ్చేందుకు మూడేళ్ల క్రితం నాటి సర్కారు టీఎ్సబీపా్సను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆన్లైన్లో దరఖాస్తులు.. ఆఫ్లైన్లో అనుమతులు
టీఎస్బీపాస్లో సరైన పత్రాల్లేకున్నా పర్మిషన్లు
తిరిగి ఆన్లైన్లో నమోదు కాని ఫైళ్లు
ఆఫ్లైన్లోనూ భద్రపరచకుండా మాయం
పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు,
డెవలపర్ల బహుళ అంతస్తుల ఫైళ్లే అధికం
అన్నీ అక్రమ అనుమతులేనన్న అభిప్రాయాలు
విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
హెచ్ఎండీఏ, గ్రేటర్ అధికారుల్లో ఆందోళన
టీఎస్బీపాస్.. భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల్లో పారదర్శకత పెంచడానికంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్. దరఖాస్తు దగ్గర్నుంచి అనుమతుల దాకా అన్నింటినీ ఇందులో నమోదు చేయడం ద్వారా అవకతవకలను అరికట్టవచ్చన్నది లక్ష్యం. కానీ, నిబంధనల ఉల్లంఘనకు అలవాటుపడిన కొందరు.. టీఎస్బీపాస్ను బైపాస్ చేసి ఆఫ్లైన్లో అనుమతులు పొందారు. ఆయా ఫైళ్లను అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకుండా మాయం చేశారు. వందలాది దరఖాస్తులను, ప్రధానంగా బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తులన్నింటినీ ఆఫ్లైన్లోకి మార్చేసి, అనుమతులిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. బడా రియల్ సంస్థలు, డెవలపర్లకు చెందిన కీలక ఫైళ్లు ఇలా మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ అనుమతులు వేగవంతంగా, పారదర్శకంగా ఆన్లైన్లోనే ఇచ్చేందుకు మూడేళ్ల క్రితం నాటి సర్కారు టీఎ్సబీపా్సను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. తద్వారా సత్వరమే నిర్మాణ అనుమతులు పొందడంతోపాటు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో ఆన్లైన్లో దరఖాస్తుదారు తెలుసుకునే అవకాశం కల్పించామని ప్రకటించింది. 21 రోజుల్లో అనుమతులు వస్తాయని, ఏ అధికారి వద్దనైనా నిర్ణీత సమయాన్ని దాటి దరఖాస్తు ఆగితే.. ఆ అధికారికి జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించామనీ వెల్లడించింది. అప్పట్లో కొందరు అధికారులకు జరిమానా కూడా విధించారు. 100 నుంచి 500 చదరపు గజాలలోపు స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించని అధికారులపై ఈ జరిమానాలు విధించారు. అయితే ఏడు అంతస్తుల నుంచి 58 అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు పొందిన ఫైళ్లను మాత్రం అత్యధికం ఆఫ్లైన్లోకి మార్చేశారు. టీఎ్సబీపా్సలో దరఖాస్తు చేసిన తర్వాత రెవెన్యూపరమైన అంశాలను పరిశీలించే తహసీల్దార్ స్థాయిలోనే ఫైళ్లను ఆఫ్లైన్లోకి చేసేశారు. టీఎ్సబీపాస్ రాకముందు మాదిరిగానే దరఖాస్తులను క్లియర్ చేశారు. ఆఫ్లైన్ కావడంతో సరైన పత్రాలు లేకపోయినా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఉన్నతాధికారులు దస్త్రాలను తెప్పించుకున్నారు. కిందిస్థాయి అధికారులు సరైన పత్రాల్లేవని ఫైలును నిలిపివేసినా.. అప్పటి హెచ్ఎండీఏ డైరెక్టర్ శివబాలకృష్ణ తమకు పంపించాలంటూ ఆదేశాలిచ్చారని, మంత్రిగారు చెప్పారంటూ ఆగమేఘాల మీద అనుమతులిచ్చినట్లు సమాచారం. శివబాలకృష్ణ ఇటీవల ఏసీబీ దాడుల్లో అక్రమాస్తుల కేసులో చిక్కుకొని రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే.
అక్రమ అనుమతుల దస్ర్తాలు మాయం..
ఏవైనా దరఖాస్తులకు ఆఫ్లైన్లో అనుమతులిచ్చినా.. ఆ ఫైళ్లను తిరిగి ఆన్లైన్లోకి మారిస్తే వాటిని భద్రపరిచేందుకు వీలుంటుంది. కానీ ఆఫ్లైన్లో అనుమతులిచ్చిన ఏ ఒక్క దరఖాస్తునూ ఆన్లైన్లోకి మార్చలేదని తెలిసింది. ఇటీవల వరుసగా హెచ్ఎండీఏలో ఏసీబీ సోదాలు, వివిధ భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనుమతులపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వివిధ రకాల అనుమతులపై ఏ రోజుకారోజు నివేదికలు అడుగుతోంది. కానీ, చాలావరకు ఫైళ్లు హెచ్ఎండీఏలో మాయమైనట్లు తెలిసింది. అయితే ఇటీవల ఏసీబీ సోదాల్లో శివబాలకృష్ణ పనిచేసిన మాసబ్ట్యాంక్లోని రెరా ఆఫీసులో పలు హెచ్ఎండీఏ ఫైళ్లు బయటపడినట్లు సమాచారం. కొన్ని ఫైళ్లను మాత్రం అధికారులే మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. శివబాలకృష్ణ చేసిన తప్పిదాల మకిలి తమకు కూడా అంటుకుంటుందన్న ఉద్దేశంతో.. కొందరు అధికారులు ఇటీవల ప్రభుత్వం అడిగిన నివేదికల్లో సమాచారం లేదని చెప్పినట్లు తెలిసింది. సంబంధిత ఫైళ్లను తాము అప్పట్లోనే డైరెక్టర్ శివబాలకృష్ణకు పంపామని, ఆ తర్వాత సంబంధిత ఫైళ్లు తిరిగి వెనక్కి రాలేదని చెప్పిన్నట్లు సమాచారం.
ఐటీ కారిడార్లో భారీ ప్రాజెక్టులు చేపడుతున్న పలు సంస్థలు అనుమతులన్నీ ఆఫ్లైన్లోనే పొందాయి. కానీ, ఆయా సంస్థల ఫైళ్లు పునఃపరిశీలనకు మాత్రం హెచ్ఎండీఏలో దొరకడం లేదు. 111 జీవో పరిధిలోని వట్టినాగులపల్లికి సంబంధించిన ఫైళ్లు కూడా ఇలాగే మాయమైనట్లు తెలుస్తోంది. వట్టినాగులపల్లిలోని 100 నుంచి 200 ఎకరాల భూములను బయో కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్లోకి మార్చేందుకు ఎన్నికల ముందు ప్రభుత్వం ఆగమేఘాల మీద చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనుమతులు ఇచ్చింది. ఈపీటీఆర్ఐ నివేదిక ఆధారంగా ఆ మార్పు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఈపీటీఆర్ఐ నివేదికను హెచ్ఎండీఏలోని ఏ ప్లానింగ్ అధికారి కూడాచూడలేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంబంధిత ఫైళ్లు రావడంతో జీ హుజూర్.. అంటూ కిందిస్థాయి అధికారులు ఉన్నత స్థాయికి పంపారు. సంబంధిత శాఖ మంత్రి ఆమోదంతో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేశారు. కానీ, సంబంధిత ఫైళ్లు, ఈపీటీఆర్ఐ నివేదికలన్నీ మాయమైనట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.