తెలంగాణకు మళ్లీ వాన గండం

ABN, Publish Date - Sep 05 , 2024 | 11:01 AM

హైదరాబాద్: తెలంగాణకు మరో ప్రమాదం పొంచి వుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.

హైదరాబాద్: తెలంగాణకు మరో ప్రమాదం పొంచి వుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌లో 6.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. షేక్‌పేటలో 5.8 సెం.మీ. బంజారహిల్స్ 5.3సీ.మీ., బహదూర్‌పురలో 4.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాగల మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షలు కురిసే అవకాశముంది.


వర్షాలు ఒకింత తగ్గుముఖం పట్టాయని ప్రజలు ఊరట చెందేలోపే.. మంగళవారం అర్ధరాత్రి నుంచి కొన్నిజిల్లాల్లో.. బుధవారం ఉదయం నుంచి కొన్ని చోట్ల.. భారీ వర్షాలు దంచికొట్టాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహెడలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి కోహెడ మండలం జలదిగ్బంధమైంది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వర్షం 9 గంటల వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్‌లో మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన వర్షం.. తీవ్ర రూపం దాల్చి ఉరుములు, మెరుపులతో రెండు గంటలపాటు కుంభవృష్టిగా కురిసింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు ఘట్‌కేసర్‌ మండలంలోని వెంకటాపూర్‌ అరుంధతి, వైభవ్‌కాలనీల్లో వరదనీరు ఇళ్లలోకి వచ్చి చేరింది.


అలాగే.. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ మరోసారి జలమయమైంది. కొన్ని హాస్టళ్ల సెల్లార్లలో నీరు చేరడంతో విద్యార్ధులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న 161 నంబరు నాందేడ్‌–అకోలా జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. దాదాపు 4 గంటలపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో హైవే అథారిటీ సిబ్బంది.. డీజిల్‌మోటార్లను తెప్పించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిని ట్యాంకర్లతో తోడేసినా వరదనీటి ప్రవాహం తగ్గలేదు. ఇక.. జోగులాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టు కింద నిర్మించిన చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో చేరిన వరదనీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ అంతా గ్రామాన్ని చుట్టుముట్టి ఇళ్లలోకి చేరడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామంలోకి వస్తున్న తేళ్లు, పాముల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. బుధవారం గ్రామానికి చెందిన రైతు వడ్డె మల్లేష్‌ (18) నారుమడిలో నారు తీయడానికి వెళ్లి విషపురుగు కాటుకు బలయ్యాడు. ఇక.. హైదరాబాద్‌ నగరంలోనూ.. మంగళవారం రాత్రి 11గంటల నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకూ పలు ప్రాంతాల్లో 8.7 నుంచి 5 సెం.మీ వర్షం కురిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వెనక్కి తగ్గొద్దు ఎవరైనాసరే కూల్చేయండి..

ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక..

వరద బాధితులకు అండగా ABN

మళ్లీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 05 , 2024 | 11:01 AM