MLA తాగునీటి సమస్యపై నిర్లక్ష్యం వీడండి
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:23 AM
మున్సిపాల్టీ ప్రజలకు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం ఎందుకు.. ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు.. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.. ’ అని ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాదను హెచ్చరించారు.
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ‘ మున్సిపాల్టీ ప్రజలకు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం ఎందుకు.. ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు.. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.. ’ అని ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాదను హెచ్చరించారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. మున్సిపాల్టీలోని పలు వార్డుల్లో తాగునీటి సమస్యలున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయన్నారు. శిల్పారామం కాలనీలో కొత్తబోరు వేసి మూడు మాసాలు అవుతున్నా.. అది ఇంతవరకూ ఎందుకు వినియోగంలోకి తేలేదని ప్రశ్నించారు. పట్టణంలో ప్రధాన వీధులు, అవసరమైన చోట్ల వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వీడాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్లు పీసీ గంగన్న, బెస్త చలపతి, కన్వీనర్ రామాంజినేయులు, సామకోటి ఆదినారాయణ, రామారావు, అంబులెన్సు రమేష్, కృష్ణప్రసాద్, శుభచంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.