AP High Court: అరెస్టు నుంచి రక్షణ కుదరదు
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:05 AM
మద్యం కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి
అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
3 రోజులు పోలీసు కస్టడీకి వంశీ
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు.
పిటిషనర్ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని, ఆయన్ను ఏ నిమిషంలోనైనా సీఐడీ పోలీసులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని, విచారణను వాయిదా వేయాలని సీఐడీ తరఫున పీపీ మెండ లక్ష్మీనారాయణ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.