బంగారు భవిష్యత్తుకు దిక్సూచి
ABN , Publish Date - Apr 20 , 2025 | 02:09 AM
ఇంటర్ తర్వాత ఏయే కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఏ విభాగంలో ప్రొఫెషనల్ విద్యను ఎంచుకోవాలి? ఏ విద్యాసంస్థలో చేరాలి? ఎంచుకున్న విద్యాసంస్థల్లో సీటు పొందడం ఎలా? ఫీజులెలా ఉంటాయి? ఇలాంటి సందేహాలను అప్పటికప్పుడే నివృత్తి చేసి విద్యార్థులకు దిశానిర్దేశం చేసి పెద్దలకు ఊరటనిచ్చే దిక్సూచిలా నిలచింది ఆంధ్రజ్యోతి-ఐఆర్ఎంఎస్(ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్) ఎడ్యుకేషన్ ఎక్స్పో.
- 30స్టాల్స్ ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు
- ప్రారంభానికి ముందునుంచే పోటెత్తిన విద్యార్థులు
- పిల్లలతో సహా తరలివచ్చిన తల్లిదండ్రులు
- నేడు కూడా కొనసాగనున్న ఎక్స్పో
తిరుపతి(విద్య/రూరల్), ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ తర్వాత ఏయే కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఏ విభాగంలో ప్రొఫెషనల్ విద్యను ఎంచుకోవాలి? ఏ విద్యాసంస్థలో చేరాలి? ఎంచుకున్న విద్యాసంస్థల్లో సీటు పొందడం ఎలా? ఫీజులెలా ఉంటాయి? ఇలాంటి సందేహాలను అప్పటికప్పుడే నివృత్తి చేసి విద్యార్థులకు దిశానిర్దేశం చేసి పెద్దలకు ఊరటనిచ్చే దిక్సూచిలా నిలచింది ఆంధ్రజ్యోతి-ఐఆర్ఎంఎస్(ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్) ఎడ్యుకేషన్ ఎక్స్పో. రెండు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్న ఎక్స్పో శనివారం ఉదయం ఎయిర్ బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభమైంది. విద్యా ప్రముఖులు జ్యోతి ప్రజ్వలనతో ఎక్స్పోను ప్రారంభించారు. ప్రముఖ విద్యాసంస్థ అపోలో యూనివర్సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నరేశ్కుమార్రెడ్డి రిబ్బన్ కత్తిరించగా రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర, తెలంగాణా అడ్మిషన్స్ హెడ్ రమ్యకృష్ణ, టర్న్కీ ఈవెంట్స్ సీఈవో రాధాకృష్ణన్, ఐఆర్ఎంఎస్ ఫౌండర్ అండ్ సీఈవో రాజ.సి, ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, బ్రాంచ్ మేనేజర్ సురేష్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఎక్స్పోను ప్రారంభించారు.
ఎక్స్పో వైపే అందరి అడుగులు : శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో ప్రారంభం కాగా అంతకు ముందు నుంచే విద్యార్థులు పోటెత్తారు. బిడ్డలతో తరలివచ్చిన తల్లులు, తండ్రులు కొందరైతే స్నేహితులతో వచ్చిన విద్యార్థులు మరికొందరు. కొన్ని కళాశాలల అధ్యాపకులు కూడా తమ విద్యార్థులను ఎక్స్పోకు తీసుకువచ్చారు. దీంతో పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ విద్యార్థులు, పెద్దలతో నిండిపోయింది. విద్యాసంస్థల సహాయ కేంద్రాలు కిక్కిరిసిసోయాయి. తమకు కావాల్సిన కోర్సులు అందించే విద్యా సంస్థలకు చెందిన స్టాళ్లకోసం ఎక్స్పోలో ఆసక్తిగా వెతికారు. ఆయా స్టాళ్లలోని ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్రోచర్లు తీసుకున్నారు. అందులోని కోర్సుల వివరాలను చదువుతూ వాటి గురించి చర్చించుకుంటూ లక్ష్యం నిర్దేశించుకునేందుకు మార్గం చిక్కిందన్న భరోసాతో ఇంటికి మళ్లారు. ఎక్స్పో రాత్రి 7గంటల వరకు కొనసాగింది. ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఎక్కడో దూరానవున్న అవకాశాలన్నింటినీ పోగుచేసి విద్యార్థులకు అందించిన ఆంధ్రజ్యోతి-ఐఆర్ఎంఎస్ ఎక్స్పోకు మొదటిరోజు విశేష ఆదరణ లభించింది. ఆదివారం కూడా ఎక్స్పో కొనసాగనుంది.