తిరుపతి పూర్వ డీసీ సస్పెన్షన్ కొనసాగింపు
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:25 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పూర్వ డిప్యూటీ కమిషనర్ (డీసీ) పి.చంద్రమౌళీశ్వర్రెడ్డి సస్పెన్షన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
శాఖాపరమైన విచారణకు ఆదేశం
తిరుపతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పూర్వ డిప్యూటీ కమిషనర్ (డీసీ) పి.చంద్రమౌళీశ్వర్రెడ్డి సస్పెన్షన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు తేల్చేందుకు రెగ్యులర్ శాఖాపరమైన విచారణ జరపాలని నిర్ణయించింది. దానికనుగుణంగా అనంతపురం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ పి.విశ్వనాథను విచారణాధికారిగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే.. తిరుపతి కార్పొరేషన్లో గత వైసీపీ ప్రభుత్వంలో పి.చంద్రమౌళీశ్వర్రెడ్డి డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. 2021లో తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆయన తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్వోగా వ్యవహరించారు. అయితే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయకుండానే తనకు తానుగా ఆయన ఈఆర్వోగా వ్యవహరించినట్టు ఆ తర్వాత తేలింది. అనధికారికంగా ఈఆర్వోగా వ్యవహరించిన సమయంలో ఎపిక్ కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ రెండు ఆరోపణలను సీరియ్సగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 9న ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం గతేడాది సెప్టెంబరు 29న చంద్రమౌళీశ్వర్రెడ్డి సస్పెన్షన్ను సమీక్షించిన రివ్యూ కమిటీ సస్పెన్షన్ ఎత్తివేసేందుకు నిరాకరించింది. దాంతో ఆయన సస్పెన్షన్ ఇప్పటిదాకా కొనసాగించింది. తాజాగా గతనెల 13వ తేదీన రెండోసారి రివ్యూ కమిటీ సమావేశమై సస్పెన్షన్పై సమీక్షించింది. ఆ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సస్పెండు కావడం, అలాగే ఆయనపై వచ్చిన ఆరోపణలు ఎన్నికల నిబంధనల పరంగా తీవ్రమైనవి కావడంతో సస్పెన్షన్ను యధాప్రకారం కొనసాగించాలని సిఫారసు చేసింది. దీంతో ఆయన సస్పెన్షన్ను తదుపరి ఉత్తర్వుల వరకూ కొనసాగించాలని రాష్ట్ర మున్సిపల్ పాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురే్షకుమార్ ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విచారణాధికారిగా అనంతపురం ఆర్డీ
తిరుపతి పూర్వ డీసీ పి.చంద్రమౌళీశ్వర్రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ వచ్చిన తీవ్రస్థాయి ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రభుత్వ ం నిర్ణయించింది. దీనికి అనంతపురం మున్సిపల్ ఆర్డీ పి.విశ్వనాథను విచారణాధికారిగానూ,కార్పొరేషన్ ప్ర స్తుత డిప్యూటీ కమిషనర్ అమరయ్యను ప్రెజెంటింగ్ అధికారిగానూ నియమించింది.మూడు నెలల్లో విచార ణ ముగించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం విచారణాధికారిని ఆదేశించింది.ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.