సీ..నిమా హిట్టే!
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:01 AM
తెలుగు సినిమా మారింది.. బడ్జెట్ పెరిగింది.. చిత్రీకరణలోనూ తేడా వచ్చింది.. ఎక్కడో విదేశాలకు కాకుండా లోకల్ స్పాట్లకు డిమాండ్ పెరిగింది. గతంలో సినిమా తీశారంటే విదేశాలకు వెళ్లాల్సిందే. ప్రస్తుతం గోదావరి జిల్లాల వెంట పరుగెడుతున్నారు.
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
పుష్ప-2 సినిమాలో ఎర్రచందనం దుంగలను విదేశాలకు షిప్లో తరలించే సీన్ చూశారా.. అందులో హీరో అల్లు అర్జున్ పోర్టులో నిలబడి సవాల్ చేస్తాడు.. ఆ తర్వాత ఎర్రచందనం పట్టుకోవడానికి విలన్ ఫాజిల్ సైతం పోర్టులో అడుగుపెడతాడు.. ఆ కీలక సన్నివే శాలు ఎక్కడో తెలుసా.. ఇదిగో మన కాకినాడ సీపోర్టులోనే..
హీరో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా చూశారా.. అందులో విలన్ కొడుకు షిప్లో కస్టమ్స్కు దొరికిపోతాడు. అప్పుడు విలన్ ఆ షిప్ను సముద్రంలోనే పేల్చేస్తాడు.. ఆ సీన్లలో కొన్ని కాకినాడ సీపోర్టులోనే తీశారు.
దుల్కర్సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో హీరో తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంటాడు. ఈ సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాంకీ హీరో వద్దకు వెళ్లి రూ.2 లక్షలు ఇస్తే పోర్టులో దిగుమతై ఉండిపోయిన టీవీల స్టాకును రప్పిస్తానని చెబుతాడు. అప్పుడు రాంకీ హీరో వద్ద డబ్బులు తీసుకుని పోర్టులో కస్టమ్స్కు డబ్బులు ఇచ్చి టీవీల స్టాకును విడిపిస్తాడు. దాంతో హీరోకు భారీగా లాభం వస్తుంది. ఈ ముఖ్యమైన సీన్లన్నీ ఎక్కడో కాదు.. కాకినాడ సీ పోర్టులోనే షూటింగ్ చేశారు.
బ్లాక్బస్టర్ మూవీ అలవైకుంఠపురంలో హీరో అల్లు అర్జున్ విలన్ సముద్రఖనితో గొడవ పడే సీన్లు చూశారా.. అక్కడ విలన్ కొడుకుతో సాగించే ఆసక్తిక రమైన స్టైలిష్ ఫైట్లు అందరినీ అలరిస్తాయి. ఇది కాకినాడ సీపోర్టులోనే షూటింగ్ చేశారు..
అనేక బ్లాక్బస్టర్ తెలుగు సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా కాకినాడ సీపోర్టు మారింది.. చాలా సినిమాల్లో అత్యంత కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ ఫైట్లు, షిప్ల్లో కార్గో ఎగుమతికి సంబంధించిన సీన్లు సీపోర్టులోనే చేస్తున్నారు. పోర్టులో షూటింగ్ చేయడానికి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో ఏదొక చిన్న పార్ట్ అయినా పోర్ట్లో షూట్ చేస్తే బొమ్మ హిట్ అనే సెంటిమెంట్ బలపడిపోయింది. అందుకే అనేక సినిమాలు పోర్టులో షూటింగ్ చేసుకుని హిట్ కొడుతున్నాయి.
తెలుగు సినిమా మారింది.. బడ్జెట్ పెరిగింది.. చిత్రీకరణలోనూ తేడా వచ్చింది.. ఎక్కడో విదేశాలకు కాకుండా లోకల్ స్పాట్లకు డిమాండ్ పెరిగింది. గతంలో సినిమా తీశారంటే విదేశాలకు వెళ్లాల్సిందే. ప్రస్తుతం గోదావరి జిల్లాల వెంట పరుగెడుతున్నారు. సముద్రం.. పోర్టు.. కావాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పోర్టులో సినిమా హీరోలు.. .డైరెక్టర్లు వాలిపోతున్నారు. వంద కోట్ల బడ్జెట్ నుంచి రూ.10 కోట్ల బడ్జెట్ సినిమాల వరకు కాకినాడ సీపోర్టులో షూటింగ్ చేసుకోవడానికి పోటీపడుతుం టారు. తరచూ సినిమా షూటింగ్ లతో సందడి మారి సినిమా పోర్టుగా పేరు తెచ్చుకుంది. పోర్టులో అనేక ప్రాంతాలు కీలక సన్నివేశాల చిత్రీకరణకు అనువుగా ఉండడంతో చాలామంది డైరెక్టర్లు సినిమా షూటింగ్లకు ఎంచుకుంటున్నారు. సీపోర్టుకు తరచూ వివిధ దేశాల నుంచి భారీ నౌకలు ఏకంగా బెర్త్ వద్దకే వస్తాయి. కార్గో లోడింగ్కు వారం నుంచి పది రోజుల వరకు ఇక్కడే ఉంటాయి. కస్టమ్స్ అధికారులు, భారీ క్రేన్లు, టిప్పర్లు, విశాలమైన బెర్త్లు, వెనుక సముద్రం.. ఇవన్నీ సినిమా షూటింగ్కు అనువుగా, అందంగా ఉంటున్నాయి. దీంతో అనేక చిత్రాలు ఇక్కడకు క్యూ కడుతున్నాయి.
అల్లు అర్జున్కు ఎంత సెంటిమెంటో..
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్కు కాకినాడ సీపోర్టు సెంటిమెంట్గా మారింది. ఆయన సినిమా ఏదైనా సీపోర్టులో షూటింగ్ జరగాల్సిందే. తొలుత అలవైకుంఠపురం సినిమాలో కీలక ఘట్టాలన్నీ ఇక్కడే చిత్రీకరించారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా షూట్ చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. పుష్ప-2 కూడా ఇక్కడే వారాల తరబడి షూటింగ్ చేశారు.
షూటింగ్కు రోజుకు రూ.లక్ష
పోర్టు...షిప్లు.. సముద్రం బ్యాక్డ్రాప్లో సినిమా షూటింగ్ చేయాలంటే చాలా కష్టం. పోర్టుల్లో అనుమతులివ్వరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోర్టులో షూటింగ్ చేయాలంటే వైజాగ్ పోర్టు కేంద్రం ఆధీనంలో ఉంటుంది. అనుమతులు కష్టం. పక్కనే గంగవరం పోర్టు ఉన్నా నేవీ స్థావరాల నేపథ్యంలో అనుమతులు రావు. ఆ తర్వాత కాకినాడ పోర్టు ఉంది. అయితే ఇక్కడ అనుమతులను పోర్టు యాజ మాన్యం సులువుగా ఇస్తోంది.సినిమా షూటింగ్లకు విశాలంగా ఉండ డంతో ఎక్కువ మంది డైరెక్టర్లు ఇటే మొగ్గు చూపుతున్నారు. వాస్త వానికి ఎయిర్పోర్టు లేదా మెట్రో స్టేషన్లు, రైళ్లలో షూటింగ్ చేయా లంటే రోజుకు రూ.16 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. కాకినాడ సీపోర్టులో రోజుకు షూటింగ్కు రూ.లక్ష వసూలు చేస్తారు. తక్కువ ఛార్జీలు ఉండడం కూడా పోర్టులో సినిమా షూటింగ్లకు కలిసివస్తోంది. వాస్తవానికి పోర్టు కట్టిన స మయంలో సినిమా షూటింగ్లకు ఛార్జి రోజు కు రూ.10 వేలు.అప్పుడే ఆర్.నారాయణ మూర్తి హీరోగా ఎర్రసముద్రం సినిమా షూటింగ్ చేశారు. సినిమా షూటింగ్లకు సరిపడా వాతావరణం పోర్టులో ఉండడంతో ఇక్కడకు క్యూ కడుతున్నారు. ఇక్కడ చిత్రీకరణ చేసుకున్న సినిమాల్లో 80 శాతం వరకు హిట్ అవుతున్నాయి. సినిమాకు సంబంధించి హీరో పోర్టులో షూటింగ్లో పాల్గొనే సన్నివేశాలుంటే ఆ సినిమా హిట్ పక్కా అని పోర్టు అధికారులు చెబుతుండడం విశేషం.
22 సినిమాల షూటింగ్
కాకినాడ సీపోర్టులో ఇప్పటివరకు 22 సినిమాల షూటింగ్లు జరిగాయి. 2000లో విజయకాంత్ హీరోగా మాస్, 2008లో ఆర్.నారాయణమూర్తి హీరోగా ఎర్రసముద్రం, 2018లో హీరో రామ్ నటించిన హలోగురు ప్రేమ కోసమే.. విజయ దేవరకొండ హీరోగా గీత గోవిందం.. అడవి శేషు హీరోగా గూఢచారి, 2019లో శర్వానంద్ హీరోగా రణరంగం, 2019లో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్, అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురం, 2021లో అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2, హీరో శ్రీరాం నటించిన దాడి, చిరంజీవి, రాంచరణ్ నటించిన ఆచార్య, రవితేజ హీరోగా ఖిలాడీ, 2022లో నవీన్చంద్ర నటించిన రుద్ర, 2023లో బాలకృష్ణ భగవంత్ కేసరి, వెంకటేష్ నటించిన సైంధవ్, హీరో గోపిచంద్ నటించిన భీమ, రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు, పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ, 2024లో దుల్కర్ సల్మన్ లక్కీ భాస్కర్, అల్లు అర్జున్ పుష్ప-2, హీరో సిద్దు డీజే టిల్లు స్క్వేర్, ఉపేంద్ర హీరోగా రోసీ-45 తదితర చిత్రాలు ఇక్కడే షూటింగ్లు చేసుకున్నాయి. పోర్టులో షూటింగ్ చేస్తే ఆ సినిమా హిట్ అనే ప్రచారం బలంగా ఉంది.