AP Salary Crisis: 8 నెలలుగా జీతాలు లేవు
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:35 AM
ఆంధ్రప్రదేశ్లోని 650 మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు 8 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో సమస్య పరిష్కరించాలని కోరుతూ అధికారులు పట్టించుకోకపోవడాన్ని విమర్శిస్తున్నారు
గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జీతాలు అందక 8 నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రాష్ట్ర వ్యాప్తంగా 650 మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చొరవ తీసుకుని తమకు జీతాలిప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. డీడీఓలుగా అధికారాలు పొందిన 650 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటి వరకు పొజిషన్ ఐడీ క్రియేట్ చేయకపోవడం, అదనపు గ్రేడ్ 4 పంచాయతీల్లో నియమితులైన కార్యదర్శులకు కేడర్ స్ట్రెంత్ సమస్య చూపుతున్న కారణంగా 8 నెలలుగా జీతాలు నిలిచిపోయాయని తెలిపారు. తమ డేటా కమిషనర్ కార్యాలయానికి, ట్రెజరీకి వెళ్లినా సమస్యను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తాత్కాలిక పరిష్కారం కింద ఒక గ్రేడ్ మినహాయించి, జీతాల సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. కనీస అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.