Share News

స్టార్టప్‌లకు సరికొత్త ఊపు

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:07 AM

రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌)తో స్టార్ట్‌పలు, ఆవిష్కరణలకు సరికొత్త ఊపు రానుందని, ఈ హబ్‌తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు.

స్టార్టప్‌లకు సరికొత్త ఊపు
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో మారనున్న పారిశ్రామిక రంగ రూపురేఖలు

విజయవాడలో స్పోక్‌ ప్రాంతీయ కేంద్రం అభివృద్ధికి ముమ్మర కసరత్తు: కలెక్టర్‌ లక్ష్మీశ

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌)తో స్టార్ట్‌పలు, ఆవిష్కరణలకు సరికొత్త ఊపు రానుందని, ఈ హబ్‌తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన టాటా ఇన్నోవేషన్‌ హబ్‌-స్పోక్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్స్‌(ఐటీఈ అండ్‌ సీ) ప్రత్యేక అధికారి దీప్తిరావుతో పాటు సమన్వయ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్టార్టప్‌, ఆవిష్కరణల వ్యవస్థలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలను అమలు చేయడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమరావతిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ హబ్‌కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ స్పోక్స్‌ కేంద్రాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ మద్దతు, ప్రైవేటు నిర్వహణలో ఉండే ప్రధాన హబ్‌తో పాటు ప్రాంతీయ కేంద్రాలకు ప్రత్యేక బోర్డులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రాంతీయ కేంద్రానికి ఒక ప్రమోటర్‌ ప్రెసిడెంట్‌గా, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సహ ప్రమోటర్లు, ఇద్దరు స్వతంత్ర నిపుణులతో పాటు ప్రభుత్వం, విద్యారంగం, పారిశ్రామిక అసోసియేషన్ల నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఇందుకు ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తుందన్నారు. పెట్టుబడులు, పైనాన్సింగ్‌, ఇంక్యుబేషన్‌, భాగస్వాముల నిర్వహణ, అకౌంటింగ్‌, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ వంటి విధులను బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ నిర్వహిస్తుందని వివరించారు. విజయవాడ ప్రాంతీయ స్పోక్‌ కేంద్రం కార్యకలాపాల నిర్వహణకు శాశ్వత ప్రాంగణం అందుబాటులోకి వచ్చేంతవరకు తాత్కాలిక భవనంతో పాటు మౌలిక వసతులు కల్పించడం, కార్యకలాపాలు పూర్తిస్థాయి లో ప్రారంభమయ్యేలా చూడటంపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లాస్థాయి ఇన్నోవేషన్‌ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుందని వివరించారు. వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ లక్ష్య సాధనకు, స్వర్ణాంధ్ర 2047ను సాకారం చేయడంలో విద్యాసంస్థలు, పారిశ్రామి క సంఘాలు భాగస్వాములవుతాయని సమావేశానికి హాజరైన ప్రతినిధు లు స్పష్టం చేశారు. విట్‌ ఏపీ ప్రతినిధి డాక్టర్‌ అమీత్‌ చరణ్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రతినిధి ఉదయన్‌ బక్షి, మోహన్‌ స్పింటెక్స్‌ ప్రతినిధి వి.రమేష్‌, ఏపీఐఐసీ జడ్‌ఎం కె.బాబ్జి, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 01:07 AM