కాల్వబుగ్గ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:32 AM
తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ అన్నారు.

ఓర్వకల్లు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మంగళవారం మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయాన్ని మల్లెల రాజశేఖర్తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈ లక్ష్మీపతి, డీఈ శ్రీనివాస్ ప్రసాద్, సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ విద్యాసాగర్, ఈవో మద్దిలేటి, కాల్వబుగ్గ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పరిశీలిం చారు. వారికి ఈవో మద్దిలేటి, ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని చిన్న, పెద్ద కోనేరులను, పరిసరాలను పరిశీలిం చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ రూ.14 కోట్ల పనులతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రణాళికను బోర్డు సభ్యులకు ఇచ్చారు. ఇటీవలె కాల్వబుగ్గ దేవస్థానానికి రూ.14 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా నివేదికలు ఇచ్చామని అన్నారు. కాల్వబుగ్గలో రూ.14 కోట్లలతో స్టోన్ ప్లోరింగ్, పశ్చిమాన 5 అంతస్థుల రాజగోపురం పునఃనిర్మాణం, మూడంతస్థుల రాజగోపురాల నిర్మాణం, ఆలయ ప్రదేశం చుట్టూ ప్రహరిగోడ నిర్మాణం పనులను చేపట్టేందుకు నివేదికలు ఇచ్చినట్లు తెలిపారు. నాయకులు కాటినేని నారాయణ, కాకి దేవేంద్ర, ఆకుల మహేష్, కేవీ మధు, అబ్బీ, బజారు పాల్గొన్నారు.