Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:55 AM
పెళ్లిపీటల మీద నుంచి నేరుగా గ్రూప్-2 పరీక్షకు ఓ నవవధువు హాజరయ్యారు.

తలపై జీలకర్ర, బెల్లం తీసేయాలన్న భద్రతా సిబ్బంది
ససేమిరా అన్న వధువు..
అనుమతించిన ప్రిన్సిపాల్
తిరుపతి(విద్య), ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పెళ్లిపీటల మీద నుంచి నేరుగా గ్రూప్-2 పరీక్షకు ఓ నవవధువు హాజరయ్యారు. తిరుపతికి చెందిన మమతకు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చిత్తూరులో వివాహం జరిగింది. ఆమె తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల పరీక్షా కేంద్రంలో మెయిన్స్ రాయాల్సి ఉంది. దీంతో ఉదయం 10గంటల సమయంలో పెళ్లి దుస్తులతోనే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. ప్రవేశద్వారం ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను ఆపి, తలపై జీలకర్ర, బెల్లం, తమలపాకు తీసేసి లోపలకు వెళ్లాలని సూచించారు. దీనికి ఆమె నిరాకరించడంతో విషయాన్ని పరీక్ష కేంద్రం ఇన్చార్జి, ప్రిన్సిపల్ నారాయణమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె బయటకు వచ్చి నవవధువుతో మాట్లాడారు. అనంతరం ఏపీపీఎస్సీ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు తలపై తమలపాకును తీసి జీలకర్ర, బెల్లాన్ని పరిశీలించిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.