Share News

పంచాయతీరాజ్‌లో సంస్కరణలు

ABN , Publish Date - Apr 23 , 2025 | 02:07 AM

పంచాయతీరాజ్‌లో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆశాఖలో విస్తర ణాధికారులుగా పనిచేస్తున్న వారికి డిప్యూటీ ఎంపీడీవోల హోదా ఇచ్చింది. ఎంపీడీవోల పదోన్నతుల్లోనూ వారికి 60శాతం కోటా కల్పించింది. ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

పంచాయతీరాజ్‌లో సంస్కరణలు

పంచాయతీల విస్తరణాధికారి పోస్టు డిప్యూటీ ఎంపీడీవోగా మార్పు

ప్రభుత్వం ఉత్తర్వులు

ఆశాఖ సిబ్బందికి త్వరలో ఉద్యోగోన్నతులు

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీరాజ్‌లో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆశాఖలో విస్తర ణాధికారులుగా పనిచేస్తున్న వారికి డిప్యూటీ ఎంపీడీవోల హోదా ఇచ్చింది. ఎంపీడీవోల పదోన్నతుల్లోనూ వారికి 60శాతం కోటా కల్పించింది. ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇతర సిబ్బందికి కూడా త్వరలో ఉద్యోగోన్నతులు లభించనున్నాయి. దీంతో ఆశాఖ ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్‌లో మండల స్థాయిలో పనిచేసే విస్తరణాధికారులకు ప్రత్యేక హోదాతోపాటు ఇతర సిబ్బందికి ఉద్యోగోన్నతులు కల్పించాలని ఆశాఖ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా కోరుతూ వస్తున్నారు. కానీ గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దృష్టి సారించింది. అందుకు సంబంధించి తాజాగా జీవో నంబర్‌ 35ను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం మండల స్థాయిలో పనిచేస్తున్న పంచాయతీల విస్తరణాధికారి పోస్టు డిప్యూటీ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (డీఎంపీడీవో)గా మారింది. గ్రామ పంచాయతీల్లో పనిచేసే బిల్‌ కలెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, కార్యదర్శులు, విస్తరణాకారుల సంఖ్యాబలం అధికంగా ఉండటంతో వారికి ఉద్యోగోన్నతుల్లో 60శాతం కోటాను ప్రభుత్వం కల్పించింది. మండల, జిల్లా పరిషత్‌లలో పనిచేసే అసిస్టెంట్లు, టైపిస్టులు, ఏవోలకు 34శాతం కేటాయించింది. దీంతో ఉద్యోగోన్నతుల్లో తమకు తక్కువ అవకాశాలు ఉంటాయని పరిషత్‌ ఉద్యోగులు అంటున్నారు. ఏదిఏమైనా దశాబ్దాల కాలంపాటు నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో ఆ శాఖ ఉద్యోగుల్లో ఆనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 23 , 2025 | 02:07 AM