పేద వారి సొంతింటి కలను నెరవేర్చాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:04 PM
పేదవారి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో నిర్మాణాలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణాలను త్వరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గృహ నిర్మాణ శాఖ సమీక్షలో కలెక్టర్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : పేదవారి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో నిర్మాణాలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణాలను త్వరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశపు హాలులో గృహ నిర్మాణశాఖ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మే ఆఖరు నాటికి 8,839 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 2,686 పూర్తయ్యాయన్నారు. ఇంకా 6,153 గృహాలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. వేసవిలో ఇళ్ల నిర్మాణానికి అనుకూలమైన వాతావరణం ఉన్నందున సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగ లు, వెనుకబడిన తరగతులకు చెందిన వారికి అందించే అదనపు ఆర్థిక సహాయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. రూఫ్ లెవల్లో 1695, రూప్ కాస్ట్లో 548 ఇళ్లు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఆర్డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.