civils : అప్పుడు ఐపీఎస్.. ఇప్పుడు ఐఏఎస్
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:22 AM
IAS Success Story యూపీపీఎస్ నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ జాతీయస్థాయిలో 15వ ర్యాంకు సాధించారు. అల్లాడపేటలో వెంకటేష్ ప్రాథమిక విద్య పూర్తయింది. ఆ సమయంలో పక్క గ్రామంలో కలెక్టర్గా ఒకరు ఎంపికయ్యారు. ఆ కొలువు అంటే సమాజంలో ఎంతో గౌరవమని ఉపాధ్యాయులు చెప్పారు. ఆ మాటలు చిన్నతనంలోనే వెంకటేష్ మెదడులో దాక్కున్నాయి.
ఆ ఒక్క ఘటన.. తన జీవితాన్నే మార్చేసింది
రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపిక
మూడోసారి పరీక్ష రాసి.. ఐఏఎస్కు అర్హత
సివిల్స్లో 15వ ర్యాంకు సాధించిన వెంకటేష్
మారుమూల గ్రామంలో పుట్టారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తయింది. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడం ఎంతో ఇష్టం. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఓ దశలో ఐపీఎల్ వేలంపాటకు వెళ్లారు. అక్కడ ఎంపిక కాకపోయినా నిరాశ చెందలేదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగంలో చేరారు. అక్కడ కొంతమంది స్నేహితులు సివిల్స్ రాసి విజయం సాధించడంతో తానూ ఆ దిశగా అడుగులు వేయాలని భావించారు. రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపికై శిక్షణ పొందుతున్నా.. అంతటితో ఆగలేదు. ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో మరింత కష్టపడి చదివారు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఏకంగా 15వ ర్యాంకు సాధించారు. ఇదీ జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ విజయగాథ.
.....................
నరసన్నపేట/ జలుమూరు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): యూపీపీఎస్ నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ జాతీయస్థాయిలో 15వ ర్యాంకు సాధించారు. అల్లాడపేటలో వెంకటేష్ ప్రాథమిక విద్య పూర్తయింది. ఆ సమయంలో పక్క గ్రామంలో కలెక్టర్గా ఒకరు ఎంపికయ్యారు. ఆ కొలువు అంటే సమాజంలో ఎంతో గౌరవమని ఉపాధ్యాయులు చెప్పారు. ఆ మాటలు చిన్నతనంలోనే వెంకటేష్ మెదడులో దాక్కున్నాయి. పదోతరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ చదివే రోజుల్లో క్రికెట్పై మక్కువ పెంచుకున్నారు. స్నేహితులతో కలిసి ఎక్కువగా క్రికెట్ ఆడేవారు. జిల్లా జట్టుకు ఎంపికైనా.. మైదానంలో దిగే చాన్స్ రాలేదు. ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఐపీఎల్ మ్యాచ్లు ఆడేందుకు కూడా వేలం పాటలో పాల్గొన్నారు. అయినా అక్కడ కూడా అవకాశం కలిసి రాలేదు. దీంతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదికి రూ.23 లక్షల జీతం కొలువులో చేరారు. అక్కడ తోటి స్నేహితులు కొంతమంది సివిల్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమవడంతో వెంకటేష్కు చిన్నప్పడు ఉపాధ్యాయులు ఐఏఎస్కు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దీంతో కరోనా సమయంలో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూండేవారు. మొదటి ప్రయత్నంలో మెయిన్స్ పరీక్షలు వరకు రాశారు. రెండో ప్రయత్నంలో.. ఇంటర్వ్యూను కూడా ఎదుర్కొని.. ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సర్దార్ వల్లబాయ్పటేల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. ఎలాగైనా ఐఏఎస్ సాధించాలనే తపనతో.. గతేడాది సివిల్స్ పరీక్షలు రాశారు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు.
చేసిన తప్పు.. సరిదిద్దుకుని..
రెండో ప్రయత్నంలో మెయిన్స్లో మంచి మార్కులు సాధించినా.. ఇంటర్వ్యూలో సరిగా ఫేస్ చేయలేకపోయిన విషయాన్ని వెంకటేష్ గుర్తించారు. ఐఏఎస్ సాధనకు ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ సరిదిద్దుకోవాలనే ఆకాంక్ష .. ఉందని కుటంబసభ్యులు, బంధువుల వద్ద పలుమార్లు వెంకటేష్ చెప్పేవారు. మరింత పట్టుదలతో చదివి.. మూడోసారి పరీక్షలు రాసి.. ఇంటర్వ్యూను బాగా ఎదుర్కొన్నారు. గతంలో కన్నా రెండు మార్కులు ఎక్కువ సాధించి.. ఐఏఎస్కు ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు.
వారే ఆదర్శంగా..
అల్లాడపేటకు పక్కనే ఉన్న సైరిగాం గ్రామానికి చెందిన ముద్దాడ రవిచంద్ర గతంలో ఐఏఎస్ సాధించారు. అలాగే వెంకటేష్ అమ్మమ్మ గ్రామం బసివలస పక్కన జమ్ముకు చెందిన సాధు శిబిచక్రవర్తి కూడా గతంలో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఈ ప్రాంతంలో తిమడాం గ్రామం నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించిన వారు అధికంగా ఉన్నారు. అటువంటి వారందరినీ ఆదర్శంగా తీసుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో వెంకటేష్ పట్టుదలతో చదివారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు.
కుగ్రామంలో పుట్టి..
అల్లాడపేట ఓ కుగ్రామం. ఈ గ్రామానికి గతంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో అద్దోనంపేటగా కూడా పిలిచేవారు. అటువంటి గ్రామంలో జన్మించిన వెంకటేష్ సివిల్ సర్వీసు పరీక్షల ఫలితాల్లో సత్తాచాటి ఔరా అనిపించారు. ఐఏఎస్కు ఎంపికకావడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ తండ్రి బాన్న చంద్రరావు వ్యవసాయంతోపాటు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి రోహిణి గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వెంకటేష్ కాగా, చిన్న కుమారుడు వంశీ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. వెంకటేష్ ప్రాథమిక విద్యాభ్యాసం అల్లాడపేటలోనే సాగింది. 6, 7 తరగతులు గాయిత్రి మునసబుపేటలోను, 8 నుంచి 10వ తరగతి వరకు కేశవరెడ్డి స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. వైజాగ్ శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్ చదువుకొని.. తమిళనాడులో ఐఐటీ పూర్తి చేశారు. అనంతరం రెండేళ్లు చెన్నైలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు. అక్కడ ఉద్యోగం చేస్తూ 2023లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. అప్పట్లో అల్లాడపేట గ్రామ ఖ్యాతిని నలుమూలల చాటిచెప్పిన వెంకటేష్.. గతేడాది సివిల్స్ పరీక్ష రాసి.. తాజాగా ఐఏఎస్కు ఎంపిక కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబంలో జన్మించి ఐఏఎస్కి ఎంపికవడంపై పలువురు అభినందిస్తున్నారు.
బసివలసలో సంబరాలు
వెంకటేష్ జాతీయస్థాయిలో 15వ ర్యాంకు సాధించడంతో అమ్మమ్మ గ్రామమైన నరసన్నపేట మండలం బసివలసలో బంధువులు సంబరాలు చేసుకున్నారు. వెంకటేష్ కలెక్టర్ అయ్యేందుకు అర్హత సాధించాడని తెలియడంతో తాతయ్య మెండ శిమ్మయ్య, అమ్మమ్మ నర్సమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నా, కలెక్టర్ కావాలనే లక్ష్యంతోనే మరింత ప్రణాళికబద్ధంగా చదివి లక్ష్యాన్ని సాధించాడని మేనమామలు మెండ ఢిల్లీశ్వరరావు, ఇంద్రుడు, రుద్రుడు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రుల అభినందనలు
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫోన్లో వెంకటేష్కు అభినందనలు తెలిపారు. మంచి ర్యాంకు రావడం ఎంతో గర్వకారణమన్నారు. మారుమూల ప్రాంతానికి చెందినా.. కృషి, పట్టుదల ఉంటే రాణించగలమనడానికి వెంకటేష్ సాధించిన విజయమే ఉదాహరణ అని పేర్కొన్నారు. భవిష్యత్లో దేశసేవలో మంచి పాత్ర పోషిస్తూ.. ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.