పోలీసుల చొరవతోనే బాల్యవివాహాలకు అడ్డుకట్ట
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:31 AM
జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా కట్టడి చేయడంలో మహిళా పోలీసులు కీలక భూమిక పోషించాలని స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ.సూర్యకుమారి
అనకాపల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా కట్టడి చేయడంలో మహిళా పోలీసులు కీలక భూమిక పోషించాలని స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐసీడీఎస్, పౌర సరఫరాలు, వన్స్టాప్ సెంటర్, పోక్సో చట్టం, షీ బాక్స్ల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. పరిశ్రమలు ఉన్నచోట లైంగిక వేధింపులపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసుల ఉమ్మడి ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మహిళా పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరిస్తే బాల్య వివాహాలను పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల హెచ్ఓడీలు డ్యాష్బోర్డులో సంబంధిత శాఖల డేటా ఎంట్రీ నిరంతర ప్రక్రియగా సాగేలా చూడాలన్నారు. ఐసీడీఎస్ పరిధిలోని అన్ని విభాగాల పనితీరును అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జేసీ జాహ్నవి, ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మి, నోడల్ అధికారి సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.