7న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరకులోయ రాక?
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:15 PM
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకులోయలో ఏప్రిల్ ఏడున 20 వేల మంది విద్యార్థులతో నిర్వహించే 108 సూర్య నమస్కారాల ప్రదర్శనకు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
20 వేల మంది విద్యార్థుల 108 సూర్య నమస్కారాల ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం
పాడేరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకులోయలో ఏప్రిల్ ఏడున 20 వేల మంది విద్యార్థులతో నిర్వహించే 108 సూర్య నమస్కారాల ప్రదర్శనకు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 25, 26 తేదీల్లో అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ ఏప్రిల్ ఏడవ తేదీన నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆహ్వానించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తారని ప్రచారం జరుగుతున్నది. డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో అరకులోయలో ప్రత్యేక సమావేశంలో నిర్వహించనున్నారు. అయితే డిప్యూటీ సీఎం అరకులోయ రాకను అధికారులు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తున్నది.