పోలవరం ఎడమ కాలువ పనుల పరిశీలన
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:32 AM
పాయకరావుపేట వద్ద తాండవ షుగర్స్ వెనుక, దుర్గానగర్, దుర్గాకాలనీ, రాజీవ్నగర్కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ తవ్వకం, కొండను తవ్వేందుకు చేపడుతున్న కంట్రోల్ బ్లాస్టింగ్ పనులను గురువారం నర్సీపట్నం ఆర్డీవో వి.వెంకటరమణ, డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.
పేలుళ్లపై ఆర్డీఓకు స్థానికుల ఫిర్యాదు
పాయకరావుపేట, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట వద్ద తాండవ షుగర్స్ వెనుక, దుర్గానగర్, దుర్గాకాలనీ, రాజీవ్నగర్కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ తవ్వకం, కొండను తవ్వేందుకు చేపడుతున్న కంట్రోల్ బ్లాస్టింగ్ పనులను గురువారం నర్సీపట్నం ఆర్డీవో వి.వెంకటరమణ, డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. పనులు మందకొడిగా జరుగుతుండడానికిగల కారణాలను కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు కశింకోట సత్తిబాబు మాట్లాడుతూ, కొండను తవ్వేందుకు కొద్ది కొద్దిగా బ్లాస్టింగ్ చేయాలని అధికారులు అదేశిస్తున్నా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదన్నారు. వరుసగా 12 నుంచి 15 చోట్ల 16 అడుగుల లోతున డ్రిల్లింగ్ చేసి, ఒకేసారి పేలుళ్లు జరపడం వల్ల సమీపంలోని ఇళ్లు దెబ్బతింటున్నాయన్నారు. పేలుళ్లు జరిపేటప్పుడు ముందుగా సమాచారం ఇవ్వడం లేదన్నారు. దీనిపై ఆర్డీవో మాట్లాడుతూ, ఇక నుంచి కొద్దికొద్దిగా బ్లాస్టింగ్ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేలుళ్ల వల్ల కలుగుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు ఈఈ రామకోటేశ్వరరావు, డీఈ పి.గోపాలకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి గెడ్డం బుజ్జి, ఎంపీటీసీ సభ్యురాలు ఎం.రమాకుమారి, తహసీల్దార్ జి.సత్యనారాయణ, సీఐ జి.అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.