రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:42 PM
డివిజన్ పరిధిలో ఉన్న రంగురాళ్ల తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డీఎఫ్వో వై. వెంకట నరసింహరావు అన్నారు.
24గంటలు ఉద్యోగులు గస్తీ
డీఎఫ్వో వెంకట నరసింహరావు
చింతపల్లి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): డివిజన్ పరిధిలో ఉన్న రంగురాళ్ల తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డీఎఫ్వో వై. వెంకట నరసింహరావు అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముత్యాలమ్మ జాతర నేపథ్యంలో వ్యాపారులు, కూలీలు క్వారీలో తవ్వకాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో అటవీ శాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశామన్నారు. ప్రధానంగా సిగినాపల్లి, గురాళ్లగొంది, సత్యవరం రంగురాళ్ల క్వారీల వద్ద టాస్క్ఫోర్సు, బేస్ క్యాంప్, స్ట్రైకింగ్ ఫోర్సుతోపాటు అటవీ శాఖ ఉద్యోగులు 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. క్వారీల ప్రాంతాలను పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. క్వారీ వద్ద ఎవరైన సంచరించినా, తవ్వకాలకు ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రంగురాళ్ల వ్యాపారులు, కూలీల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అలాగే టేక్ ప్లాంటేషన్లు దొంగల బారిన పడకుండా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. అటవీ సంపద పరిరక్షణకు ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రజలు చైతన్యంతో మెలగాలన్నారు.