ఉక్కు చర్చలు విఫలం
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:37 AM
స్టీల్ప్లాంటు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశంపై రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) మొహంతి సమక్షంలో బుధవారం రాత్రి ఉక్కు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్టు కార్మికులను తొలగించరాదని, తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పాత పద్ధతిలో గేటు పాస్లు ఇవ్వాలని కార్మిక నాయకులు కోరారు. అయితే అందుకు యాజమాన్య ప్రతినిధులు సానుకూలంగా స్పందించలేదు.

తొలగించిన కాంట్రాక్టు కార్మికులను
తిరిగి తీసుకోవాలని సంఘాల నాయకుల డిమాండ్
స్పందించని యాజమాన్య ప్రతినిధులు
నేటి సాయంత్రంలోపు తేల్చకుంటే
రేపు సమ్మె చేస్తామని నేతల హెచ్చరిక
ఉక్కుటౌన్షిప్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ప్లాంటు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశంపై రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) మొహంతి సమక్షంలో బుధవారం రాత్రి ఉక్కు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్టు కార్మికులను తొలగించరాదని, తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పాత పద్ధతిలో గేటు పాస్లు ఇవ్వాలని కార్మిక నాయకులు కోరారు. అయితే అందుకు యాజమాన్య ప్రతినిధులు సానుకూలంగా స్పందించలేదు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని గురువారం సాయంత్రంలోపు ప్రకటన చేయాలని, లేనిపక్షంలో శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేస్తామని కార్మిక నాయకులు ప్రకటించారు. సంస్థ పరిస్థితులను అర్థం చేసుకొని యాజమాన్యంతో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఆర్ఎల్సీ సూచించారు. ఈ సమావేశంలో యాజమాన్యం తరపున జీఎంలు ఎం.మధుసూదనరావు, ఎన్.భాను, డీజీఎంలు సురేంద్రకుమార్, శంకర్లు, కార్మికుల తరపున మంత్రి రవి, నమ్మి రమణ, వంశీకృష్ణ, సత్యారావు, ఎల్.సొంబాబు, పితాని భాస్కరరావు పాల్గొన్నారు. చర్చల అనంతరం కార్మిక నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోనిపక్షంలో శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేయడంతోపాటు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.