No eye can see..! ఏ కన్నూ చూడదనా..!
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:12 AM
No eye can see..! ఎస్.కోట -బొడ్డవర రోడ్డులో నిలిచిన టాక్టర్లు అవి. ఎక్కడ నుంచో అక్రమంగా తవ్విన కంకరను తీసుకొచ్చాయి. సమీప పొలంలో వేసేందుకు ఒకదాని వెనక ఒకటి ఆగాయి. అదివారం నుంచి పదుల సంఖ్యలో ఈ టాక్టర్లు కంకరతో పట్టపగలే తిరుగుతున్నాయి. విశాఖ నుంచి అరకు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం ప్రజాప్రతినిధులు, అధికారులు తిరుగుతూ ఉంటారు. అయినా ఈ టాక్టర్లు ఎవరికీ కనిపించడం లేదు.
ఏ కన్నూ చూడదనా..!
ఇష్టారాజ్యంగా మట్టి, కంకర తవ్వకాలు
చెరువుల్లో ఎక్కడికక్కడే ఎక్సకవేటర్లు
రోడ్లపై పరుగులు తీస్తున్న టాక్టర్లు
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం
- ఎస్.కోట -బొడ్డవర రోడ్డులో నిలిచిన టాక్టర్లు అవి. ఎక్కడ నుంచో అక్రమంగా తవ్విన కంకరను తీసుకొచ్చాయి. సమీప పొలంలో వేసేందుకు ఒకదాని వెనక ఒకటి ఆగాయి. అదివారం నుంచి పదుల సంఖ్యలో ఈ టాక్టర్లు కంకరతో పట్టపగలే తిరుగుతున్నాయి. విశాఖ నుంచి అరకు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం ప్రజాప్రతినిధులు, అధికారులు తిరుగుతూ ఉంటారు. అయినా ఈ టాక్టర్లు ఎవరికీ కనిపించడం లేదు.
శృంగవరపుకోట, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి):
మూడేళ్ల క్రితం ఎస్.కోట మండలం కొత్తూరు, దాంపురం గ్రామాల పరిధిలోని భూములను లేఅవుట్గా మార్చారు. ఇందుకు ఎక్కడ నుంచో మట్టిని తీసుకొచ్చి కప్పారు. ఈ విషయం తెలిసి అధికారులు భూ బదలాయింపు చేయకుండా లేఅవుట్ వేసినందుకు జరిమానా, భూ బదలాయింపు రుసుం వసూలుకు నోటీస్లు జారీ చేశారు. రెండు శాఖల అధికారులు వారి నుంచి జరిమానాల వసూలుతో అప్పట్లో మట్టి, కంకర అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత చర్యలు కొనసాగక పరిస్థితి మళ్లీ మామూలైపోయింది. రెండు నెలల నుంచి ఎక్కడబడితే అక్కడ మట్టి, కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్సకవేటర్లతో లోతుగా గుంతలు పెట్టేస్తున్నారు. రోజుకు ఒక్కో ఎక్సకవేటర్ 10 నుంచి 100 ట్రాక్టర్లకు కంకర, మట్టిని ఎత్తుతున్నాయి. వీటిని తీసుకొని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా రోడ్లపై ట్రాక్టర్లు పరుగులు తీస్తున్నాయి. ప్రధానంగా రోడ్ల పక్కనున్న పొలాలనే ఈ మట్టితో కప్పేస్తున్నాయి. అధికారులకు ఇదంతా కనిపిస్తున్నా చూసీచూడనట్లు నటిస్తున్నారు.
నిబంధనలు ఇలా..
ఒక చోట నుంచి మరో చోటుకు మట్టి తరలింపునకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. రెవెన్యూ, జలవనరుల, భూగర్భ గనుల శాఖ అధికారులను సంప్రదించాలి. వారిచ్చే కొలతల ప్రకారం మట్టి, కంకర తవ్వాలి. ఇలా కాకుండా ఎవరైనా మట్టి, కంకరను తవ్వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. మట్టిని తవ్వే ఎక్సకవేటర్లు, తరలించేందుకు ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు, ఇతర పనిముట్లును స్వాధీనం చేసుకోవాలి. చట్టానికి లోబడి జరిమానాలు వసూలు చేసిన తరువాత వీటిని తిరిగి యజమానులకు అప్పగించాలి. అలాగే లేఅవుట్ తీర్చిదిద్దేందుకు వేసిన మట్టిని క్యూబిక్ మీటర్లలో లెక్క కడతారు. ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి, కంకర పొలంలో కనిపిస్తే ఆ ప్రకారం జరిమానా చెల్లించాల్సిందే.
ప్రభుత్వానికి దక్కని ఆదాయం
జిల్లాలో ప్రతి మండలంలోనూ అనధికార లేఅవుట్లున్నాయి. వాటికి అనుమతులు లేకుండా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన మట్టితో కప్పినవే. ఇటు మట్టికి, అటు భూబదలాయింపునకు జరిమానాలు వసూలు చేస్తే రూ.కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. భూ బదలాయింపు చేయకపోవడంతో పాటు పంచాయతీకి వదలాల్సిన పది శాతం భూమిని కూడా వదలడం లేదు. నిబంధనల ప్రకారం రహదారులు, కాలువలూ ఉండవు.
-- అనధికార లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ చిన్న చిన్న లొసుగులను అడ్డం పెట్టుకొని రిజిస్ర్టేషన్లు కానిచ్చేస్తున్నారు. నిర్మాణ అనుమతులకు చెల్లించాల్సిన రుసుం కంటే ఎక్కువ డబ్బులు చెల్లిస్తే అనుమతులు ఇచ్చేందుకు పంచాయతీ అధికారులు ముందుకు వచ్చేస్తున్నారు. సహజంగా లేఅవుట్ను తీర్చిదిద్దిన సమయంలోనే పంచాయతీ, రెవెన్యూ, వుడా అధికారులు అడ్డుకోవాలి. లేఅవుట్ తయారీకి ట్రాక్టర్లలో మట్టిని తీసుకువచ్చి పొలాల్లో వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు వస్తే తాత్కాలికంగా ఆపుతున్నారు.