పేదలపై విధ్వంసకాండ దారుణం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:50 AM
పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్లో పేదల ఇళ్లు తొలగించడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
పాలకోడేరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్లో పేదల ఇళ్లు తొలగించడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఇళ్లు తొలగించిన ప్రాంతంలో మంగళవారం పర్యటించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పడగొట్టిన పేదల ఇల్లు పక్కనే ఆనుకుని ఉన్న భూస్వాములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ సర్వే రాళ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పేదలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బాలింతలపై ప్రభుత్వ విధ్వంసం, అరాచకాన్ని సృష్టించిందన్నారు. చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన ఈ ఘటనను ముఖ్యమంత్రి బహుమతిగా స్వీకరిస్తారా, తిరస్కరిస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చేసిన పాపంలో కలెక్టర్ నుంచి ఎమ్మార్వో వరకు అధికారులందరూ భాగస్తులే అన్నారు. ప్రభుత్వ భూముల్లో పేదలు ఇల్లు వేసుకుంటే తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. మహిళలను మగ పోలీసులు కొట్టడంపై మానవ హక్కుల సంఘాలకు నివేదిస్తామన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన అధికారులు, ఎమ్మెల్యేకు డూడూ బసవన్నలా మారారన్నారు. డబ్బులిచ్చి ఓట్లేయించుకున్నాను అని ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణంరాజు అనర్హుడన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే రఘురామకృష్ణంరాజు అవినీతిని, ఎగ్గొట్టిన బకాయిలను బయటపెట్టాలన్నారు. ఉండి నియోజకవర్గంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు కనబడడం లేదా అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చాలని చూస్తే చూస్తూ ఉండబోమని, ఎర్రజెండా అండగా నిలుస్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో ఆరు నెలల కాలంలో వందలాది పేదల ఇళ్లు తొలగించారని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 ఉండి నియోజకవర్గంలో రివర్స్లో అమలవుతుందన్నారు. ఇక్కడ పేదలను కొట్టి సంపన్నులకు ఆస్తులను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నేతలు మంతెన సీతారాం, బి.వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, దూసి కళ్యాణి, మామిడిశెట్టి రామాంజనేయులు, కె.క్రాంతిబాబు, ధనికొండ శ్రీనివాస్, కె.తవిటినాయుడు, జుత్తిగ నరసింహమూర్తి, శేషపు అశ్రియ్య తదితరులు పాల్గొన్నారు.