Share News

నేడే సీఎం రాక

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:38 AM

సీఎం చంద్రబాబునాయుడు శనివారం తణుకు రానున్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా పలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నేడే సీఎం రాక
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల, కలెక్టర్‌, ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకులో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం

పారిశుధ్య కార్మికులు, ప్రజలు, పార్టీ శ్రేణులతో ముఖాముఖి

మంత్రి నిమ్మల, కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి ఏర్పాట్ల పర్యవేక్షణ

తణుకు/ఇరగవరం, మార్చి14 (ఆంధ్రజ్యోతి) : సీఎం చంద్రబాబునాయుడు శనివారం తణుకు రానున్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా పలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక పనులను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి పర్యవేక్షించారు. వారి వెంట సీఎం టూర్‌ కో ఆర్డినేటర్‌ పెందుర్తి వెంకటేశ్‌, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి, నియోజకవర్గ పరిశీలకులు దాసరి శ్యామ్‌చంద్రశేషు, పెచ్చెట్టి బాబు, కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అని అన్నారు. మరోవైపు ముళ్ళపూడి వెంకట్రాయ మెమోరియల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో హెలీప్యాడ్‌ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేసింది. హెలీకాప్టర్‌తో పాటు సీఎం కాన్వాయ్‌ ట్రయర్‌ రన్‌ పూర్తి చేసింది. తణుకు బాలుర ఉన్న పాఠశాల ప్రాంగణంలో ప్రజా వేదిక బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్టాల్స్‌ను సీఎం పరిశీలించనున్నారు. ఎన్టీఆర్‌ పార్కు వద్ద పారిశుధ్య కార్మికు లతో మాట్లాడను న్నారు. ఆ తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.

సీఎం పర్యటన ఇలా..

సీఎం శనివారం ఉదయం 7.30 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 8.05కు తణుకు పాలిటెక్నిక్‌ కాలేజి ప్రాంగణంలో దిగుతారు.

8.35 వరకు ప్రజలు, అధికారులు, స్థానికులను కలుస్తారు.

8.40కు రోడ్డు మార్గాన ఎన్టీఆర్‌ పార్కు వద్దకు చేరుకుని పారిశుధ్య కార్మికులతో మాట్లాడతారు.

9.30 వరకు కూరగాయ మార్కెట్‌లో సాలిడ్‌ వేస్టు మేనేజ్‌మెంటుపై మాట్లాడతారు. తర్వాత ఐక్యనగర్‌ పార్కు వద్ద పార్కు అభివృద్ధిపై ప్రణాళిక, పీ4 విధానంపై మాట్లాడతారు.

9.50 గంటలకు జడ్పీ హైస్కూల్‌లోని ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

11.15 నుంచి 12.10 వరకు జూబ్లీ రోడ్డులోని నూలివారి లే–అవుట్‌లో పార్టీ శ్రేణులు, నాయకులతోను, ఆ తర్వాత 12.45 వరకు జిల్లా అధికారులతో సమావేశం.

12.50 గంటలకు పాలిటెక్నిక్‌ కాలేజి హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 12.55 గంటలకు హెలీకాప్టర్‌లో ఉండవల్లికి బయలుదేరుతారు.

Updated Date - Mar 15 , 2025 | 12:41 AM