YSRCP Explosives Case: పేలుడు పదార్థాల నిల్వ కేసులో వైసీపీ నేత అరెస్ట్
ABN , Publish Date - Apr 21 , 2025 | 05:13 AM
బాపట్ల జిల్లా నాగరాజుపల్లిలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వచేసిన కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావు అరెస్టయ్యాడు. ఘటనపై సమగ్ర విచారణ చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
సమగ్ర విచారణకు మంత్రి అనిత ఆదేశం
బాపట్ల, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ఆదివారం బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు ఈ విషయాన్ని వెల్లడించారు. వీరితో పాటు మరో నలుగురిని నిందితులుగా చేర్చారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా కేంద్రంగా బిల్లులు లేకుండా పేలుడు పదార్ధాలు విక్రయిస్తున్న సాల్వో ఇండస్ట్రీ్సను ఏ6గా చేర్చారు. హనుమంతరావుకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీ, గోడౌన్లో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన పేలుడు పదార్ధాలను శనివారం పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. 5,000 కేజీల పేలుడు పదార్ధాలు, 2,300 ఈడీలు లభ్యమయ్యాయి. దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని జిల్లా ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన పేలుళ్ల ఘటనలతో ఏళ్ల తరబడి ఇదే వ్యాపారంలో ఉన్న వైసీపీ నేత సహకారం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలన్నారు.