Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్..
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:32 AM
పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభంకానున్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ అవకాశం కల్పించారు. దీంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోకసభ సచివాలయం అనుమతి ఇచ్చింది.

న్యూఢిల్లీ: అరకు కాఫీ (Araku Coffee)కి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ (Parliament)లో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్స్ (Coffee Stalls) ఏర్పాటు కానున్నాయి. సభాపతి ఆదేశంతో రెండు స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా (Kul Mohan Singh Arora) ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోకసభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సోమవారం నుంచి ఈనెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం గిరిజన కోఆపారేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. అలాగే రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Minister Gummadi Sandhyarani) ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్నారు.
Also Read..:
కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ..
కాగా పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్ ప్రారంభమవుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం ఆమె ఫోన్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం తాను ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు. అరకు కాఫీకి ఈ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 139 అంగన్వాడీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.20.80 కోట్లు మంజూరు చేసిందన్నారు. పీఎం జన్మన్ కింద జిల్లాకు 11 కేంద్రాలు మంజూరయ్యాయని వెల్లడించారు. వాటికి సంబంధించి 11 పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న మరో 53 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు చెప్పారు. కొండ శిఖర గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నామన్నారు. డోలీలు మోతలు తప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా గిరి బజార్ ద్వారా గిరిజనులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. కంటైనర్ ఆసుపత్రిని కూడా ప్రారంభించామని చెప్పారు.
కాఫీ స్టాల్స్కు ఏర్పాట్లు పూర్తి..
సోమవారం నుండి పార్లమెంట్లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తూర్పు కనుమల నుండి భారత దేశ పార్లమెంట్ వరకు అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ రాష్ట్ర గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతుందని, వారి స్వహస్తాలతో పండించిన కాఫీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన భారత పార్లమెంట్లో ఎంపీలు అందరినీ అమోఘమైన రుచితో మైమరపించబోతుందన్నారు. సోమవారం నుంచే పార్లమెంట్లో గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (GCC) ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ ప్రారంభం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ స్టాల్స్ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర కేంద్ర మంత్రులు.. ప్రారంభం చేయబోతున్నారని కలిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యా రాణి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని, ఏపీ కూటమి ఎంపీలు పాల్గొంటారు. అలాగే లోక్ సభ,రాజ్యసభ ఎంపీలందరూ అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్ వద్దకు విచ్చేసి ఆర్గానిక్ కాఫీని రుచి చూడాలని కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KTR: ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు..
హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం..
నాడు ఎన్టీఆర్పై హైకోర్టులో రిట్ పిటిషన్
For More AP News and Telugu News