Share News

భార్యతో వివాహేతర బంధం.. బతికుండగానే పాతి పెట్టాడు

ABN , Publish Date - Mar 26 , 2025 | 06:54 AM

అద్దెకు వచ్చిన వ్యక్తి.. తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యతో రిలేషన్‌ పెట్టుకున్న వ్యక్తిని బతికుండగానే పూడ్చి పెట్టాడు.

భార్యతో వివాహేతర బంధం.. బతికుండగానే పాతి పెట్టాడు
Haryana

మన సమాజంలో రోజు రోజుకు వివాహేతర బంధాలు పెరిగిపోతున్నాయి. కొందరు ఇలాంటి సంబంధాల కోసం జీవిత భాగస్వామిని కూడా హత్య చేయడానికి వెనకాడటం లేదు. మరి కొందరు తమ జీవితాల్లో చిచ్చు పెట్టిన వారిని హత మారుస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో అద్దెకు దిగిన వ్యక్తి తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నట్లు తెలియడంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తిని బతికుండగానే ఏడడుగుల గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఈ ఘటన హరియాణా రోహ్‌తక్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..


హరియాణా, రోహ్‌తక్‌కు చెందిన జగ్‌దీప్ అనే యోగా టీచర్.. హర్‌దీప్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. రోహ్‌తక్‌లోని బాబా మస్తంథ్ యూనివర్శిటీలో యోగా టీచర్‌గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో జగ్‌దీప్.. హర్‌దీప్ భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. దీని గురించి హర్‌దీప్‌కు తెలిసింది. దాంతో జగ్‌దీప్‌ను అంతమొందించాలని భావించిన నిందితుడు.. చర్ఖీ దద్రీ ప్రాంతంలోని పట్నవాస్ గ్రామంలో ఏడడుగుల గొయ్యి తవ్వించాడు. ఎవరైనా గోతి గురించి ప్రశ్నిస్తే.. అది బోర్‌వెల్ అని చెప్పేవాడు.

అనంతరం గతేడాది అనగా.. 2024, డిసెంబర్ 24న హర్‌దీప్ కొందరు స్నేహితులతో కలిసి జగ్‌దీప్‌ను కిడ్నాప్ చేశాడు. అతడి కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ తర్వాత హర్‌దీప్, అతడి స్నేహితులు.. జగ్‌దీప్ బతికుండగానే.. పట్నవాస్ గ్రామంలో ముందుగా తవ్వి ఉంచిన గోతిలో అతడిని పూడ్చి పెట్టారు.


ఈ క్రమంలో జగ్‌దీప్ కనిపించకుండా పోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు.. ఈ ఏడాది అనగా 2025, జనవరి 3న శివాజీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జగ్‌దీప్ కాల్ రికార్డ్స్‌ను వెలికితీయడంతో.. హర్‌దీప్ భార్యతో అతడికి గల బంధం గురించి తెలిసింది. ఈ కోణంలో దర్యాప్తు చేయగా.. దారుణం వెలుగులోకి వచ్చింది.


ఈ క్రమంలో పోలీసులు హర్‌దీప్, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము చేసిన దారుణం గురించి వెల్లడించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం నాడు అనగా మార్చి 24న పట్నవాస్ గ్రామం వెళ్లి తవ్వకాలు జరిపిన పోలీసులు జగ్‌దీప్ ‌మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి:

ముస్లింలకు మోదీ రంజాన్‌ తోఫా

ఏటీఎం నుంచి పీఎఫ్‌ సొమ్ము

Updated Date - Mar 26 , 2025 | 07:02 AM