Terror Attack: సింధు జలాలు బంద్
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:47 AM
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం పాకిస్థాన్తో సంబంధాలను కట్టిపడేసింది. పాకిస్థాన్తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసి, వాఘా-అట్టారీ సరిహద్దును మూసివేసింది. అలాగే పాక్ జాతీయులకు భారతదేశంలో ప్రవేశం నిషేధించింది.
1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేసిన భారత్
వాఘా-అట్టారీ సరిహద్దు చెక్ పోస్ట్ తక్షణం మూసివేత
సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్థానీలకు భారత్లోకి
ప్రవేశం నిషిద్ధం.. ఇప్పటికే అలా వచ్చినవారి వీసాలు రద్దు
ఈ వీసాపై వచ్చిన పాకిస్థానీలు 48 గంటల్లోగా వెళ్లిపోవాలి
భారత్లోని పాక్ హైకమిషన్లో సలహాదారుల గుర్తింపు రద్దు
వారంతా వారంలోగా తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశం
2 దేశాల్లోని హైకమిషన్ల సిబ్బంది 55 నుంచి 30కి కుదింపు
ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సీసీఎస్ భేటీ
దాయాది దేశంతో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు
నేడు అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడి వెనుక ఉన్న పాకిస్థాన్తో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ దాహార్తిని తీర్చే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసేసింది. వాఘా-అట్టారీ సరిహద్దును తక్షణం మూసివేసింది. పాక్ జాతీయులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధించడంతోసహా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం ‘భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్)’ సమావేశమైంది. ఉగ్రదాడిని తీవ్రపదజాలంతో ఖండించింది. దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. పహల్గాంలో పర్యటించి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా.. అక్కడి పరిస్థితి గురించి భేటీలో వివరించారు. ఈ దాడికి పాల్పడినవారిని, అందుకు ప్రేరేపించినవారిని తీవ్రంగా శిక్షించేంతవరకూ విశ్రమించకూడదని సమావేశం నిర్ణయించింది. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని త్రివిధ దళాలకు సూచించింది.

కాగా.. పహల్గాం ఉగ్రదాడిపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. సీసీఎస్ సమావేశం ముగిసిన అనంతరం.. అందులో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. అవేంటంటే..
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత. ఈ నిర్ణయంతో.. సింధు, దాని ఉపనదులైన జీలమ్, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నుంచి పాకిస్థాన్కు నీటి సరఫరాను ఆపేస్తారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును పాక్ విశ్వసనీయంగా, కచ్చితంగా నిలిపివేసేదాకా ఈ ఒప్పందం అమలు కాదని భారత్ ప్రకటించింది.
వాఘా-అట్టారీ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ తక్షణ మూసివేత. సరైన పత్రాలతో ఆ దారి గుండా ఇప్పటికే భారత్లోకి ప్రవేశించినవారు మే1లోపు అదే మార్గంలో వెళ్లిపోవాలని ఆదేశించింది.
సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాక్ జాతీయులకు భారత్లోకి ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికే అలా వచ్చినవారి వీసాలు రద్దయిపోతాయి. ఈ మినహాయింపు కింద భారత్లో ఉన్న పాక్ జాతీయులందరూ 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు, చట్టసభల సభ్యులు, సీనియర్ అధికారులు, వాణిజ్య ప్రముఖులు, పాత్రికేయులు, క్రీడా ప్రముఖులు.. ఇలా 24 కేటగిరీలకు చెందిన ప్రముఖులు సార్క్ దేశాల మధ్య వీసా రహిత ప్రయాణం చేసేందుకు వీలుగా 1992లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద.. ఆయా కేటగిరీలకు చెందిన ప్రముఖులకు వారి వారి దేశాలు ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్రత్యేక వీసా స్టికర్ ఇస్తాయి. ఆ స్టికర్ ఉంటే సార్క్ దేశాలకు వారు సంప్రదాయ వీసా లేకుండానే ఎన్నిసార్లయినా రావొచ్చు, పోవచ్చు.
పాకిస్థానీ హైకమిషన్లో ఉన్న రక్షణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ అవాంఛిత వ్యక్తులుగా (పర్సొనా నాన్ గ్రేటా) ప్రకటించింది. వారం రోజుల్లోగా వారంతా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే.. ఇస్లామాబాద్లో ఉన్న భారత హైకమిషన్లోని రక్షణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ భారత్ ఉపసంహరించుకుంది. ఆ పోస్టులన్నీ రద్దు చేసింది.
రెండు దేశాల్లోని హైకమిషన్లలో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..