Supreme Court : పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు కేసుల సమాచారం ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:43 AM
సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను వెల్లడించాల్సినదిగా ఆదేశించింది. వివరాలు వెల్లడించకపోతే ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేకుంటే ఎన్నికను రద్దు చేయవచ్చని తెలిపింది. కేసుల వివరాలు వెల్లడించకుంటే అది తప్పుడు అఫిడవిట్ కిందకు వస్తుందని, దాన్ని ఆధారంగా ఎన్నికను కొట్టివేయవచ్చని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ గ్రామ ప్రధాన్ ఎన్నిక రద్దుకు సంబంధించిన ఓ కేసులో ఈ మేరకు స్పష్టం చేసింది. మండీ జిల్లా పంగన గ్రామ ప్రధాన్గా పనిచేసిన బసంత్లాల్ క్రిమినల్ కేసు వివరాలను దాచి పెట్టారంటూ ప్రత్యర్థి ఆయనపై గతంలో కేసు పెట్టారు. విచారణ జరిపిన కింది కోర్టులు, హైకోర్టు ఆ ఎన్నికను రద్దు చేయడంతో పాటు, ఆరేళ్ల పాటు పోటీ చేయకూడదంటూ బసంత్పై అనర్హత వేటు వేశాయి. దీంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై క్రిమినల్ కేసును కోర్టు ఎప్పుడో కొట్టేసిందని, ప్రస్తుతం తనపై ఎలాంటి కేసులు లేవని, అయినా ఆరేళ్లపాటు అనర్హత వేటు వేశారని ఆయన వాదించారు. ఇది తీవ్రమైన శిక్ష అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అనర్హత వేటు ఆదేశాలు 8వారాల పాటు అమలు చేయకుండా నిలిపివేసింది.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్