Share News

True Guru Bhakti: సారిపుత్రుని గురుభక్తి

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:27 AM

బుద్ధుని శిష్యుడిగా సారిపుత్రుడు పూర్తి జ్ఞానాన్ని పొందినప్పటికీ ఆయనపై కృతజ్ఞతా భావంతో జీవితాంతం భక్తిగా ఉండేవాడు గురువు తనకు ఎంత విలువైనవాడో తెలియజేస్తూ ప్రతి రోజు బుద్ధుని దిశగా తలవంచి నమస్కరించేవాడు

True Guru Bhakti: సారిపుత్రుని గురుభక్తి

సద్బోధ

గౌతమ బుద్ధుని శిష్యుల్లో సారిపుత్రుడు ముఖ్యుడు. అతను బుద్ధుడి సూచనలకు అనుగుణంగా జీవిస్తూ, సాధన చేస్తూ జ్ఞానోదయాన్ని పొందాడు. అది జరిగిన కొంతకాలానికి సారిపుత్రునితో బుద్ధుడు ‘‘సారిపుత్రా! ఇక నీవు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళు, గ్రామగ్రామానికి తిరుగు. ధర్మాన్ని బోధించు. ఇక్కడ నీకు బదులు మరొకరికి స్థానం కల్పించు’’ అని చెప్పాడు.

ఆ మాటలు వినగానే సారిపుత్రుని కళ్ళలో నీళ్ళు ఉప్పొంగాయి. బుద్ధుని పాదాలను పట్టుకొని ‘‘అలా అనకండి, నన్ను మీకు దూరంగా పంపకండి. మీతోనే ఉండనివ్వండి. నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మీలా నేను పూర్ణ జ్ఞానిని కాలేదు’’ అని విలపించాడు.

అప్పుడు బుద్ధుడు ..నన్ను నీవు మోసగించలేవు సారిపుత్రా! ఇటువంటివి నా దగ్గర చెల్లవు. నీవు పొందవలసినదంతా పొందావు. నీకు జ్ఞానోదయం అయింది. అయినా ఇలా దుఃఖించడం సిగ్గుచేటు. నీవు విలపించినా, గుండెలు బాదుకున్నా ప్రయోజనం లేదు. నీవు వెళ్ళవలసిందే. ఇతరులను ఉద్ధరించవలసిందే. ఇలా నన్నే అంటిపెట్టుకొని ఎంతకాలం ఉండదలిచావు? అది కుదరదు. వెంటనే బయలుదేరు’’ అన్నాడు.

ఇక తప్పదని తెలిసిన సారిపుత్రుడి హృదయం బరువెక్కింది. బుద్ధుడికి నమస్కరించాడు. కళ్ళు ఆర్పకుండా, తనివితీరా బుద్ధుని రూపాన్ని సందర్శించాడు. ఆయన ఆశీస్సులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


ఆ తరువాత సారిపుత్రుడు తను ఎక్కడ ఉన్నప్పటికీ... ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బుద్ధుడు ఉండే దిశకు తిరిగి, తలవంచి నమస్కరించేవాడు. కృతజ్ఞతాపూర్వకంగా కన్నీరు కార్చేవాడు. ఇది చూసిన అతని శిష్యులు ..గురువుగారూ! మీరు కూడా జ్ఞాని అయ్యారు కదా! దాన్ని సాక్షాత్తూ గౌతమ బుద్ధుడే ధ్రువీకరించారు కదా! అయినా మీరు ఆయనకు నమస్కరించాలా?’’ అని ప్రశ్నించారు.

‘‘నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఆ దయామయుడి అనంతమైన ప్రేమే. నా శరీరంలోని ప్రతి అణువు ఆయనపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ఆయన కాశీలో ఉన్నా, గయలో ఉన్నా... నా శరీరం తనకుతానుగా, దానంతట అదే బుద్ధుడు ఉన్న దిశకు తిరుగుతుంది. ఉదయం, సాయంత్రం ఆయనకు నమస్కరిస్తుంది’’ అని చెప్పాడు.

ఒక వ్యక్తితో పని ఉన్నంతకాలం నమస్కారాలు పెట్టి... ఆ పని అయిపోగానే అతణ్ణి మరచిపోవడం సామాన్యుల లక్షణం. సహాయం చేసినవారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడం సజ్జనుల లక్షణం. జ్ఞానామృతాన్ని పంచిన గురువు పట్ల ఎలా స్పందించాలి? ‘గురుర్బ్రహ్మ...’ అంటూ శ్లోకాలు చెబితే సరిపోదు... సారిపుత్రునిలా కజ్ఞతజ్ఞతా భావంతో మనసా వాచా, కర్మణా జీవితాన్ని గురువుకే అంకితం చేయాలి.

-రాచమడుగు శ్రీనివాసులు


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 12:28 AM