మహిళలకో దీవి..
ABN , Publish Date - Apr 20 , 2025 | 10:45 AM
ఆ దీవిలో మహిళలే కనిపిస్తారు. సందర్శకుల దగ్గర నుంచి.. బస్సు డ్రైవర్లు, సర్వర్లు, ఫొటోగ్రాఫర్ల దాకా అందరూ మహిళలే. కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా సృష్టించిన ఒక అద్భుత ద్వీపం.. ‘సూపర్ షీ ఐలాండ్’. అందులోకి పురుషులకు స్ట్రిక్ట్గా నో ఎంట్రీ. ప్రకృతి దృశ్యాలతో అలలారే మహిళల దీవి విశేషాలివి...
అమెరికన్ వ్యాపారవేత్త క్రిస్టినా రోత్... మహిళల కోసం ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సృష్టించాలనుకుంది. అందులో భాగంగా ఫిన్లాండ్ తీరంలో ఏకంగా ఒక ద్వీపాన్నే కొనుగోలు చేసి దానికి ‘సూపర్ షీ ఐలాండ్’ అని పేరు పెట్టింది. అక్కడ మహిళల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఒక రిసార్టు ఏర్పాటు చేసింది. 2018 నుంచి అది అందరికీ అందుబాటులోకి వచ్చింది.
సముద్రం మధ్యలో, ప్రశాంతమైన వాతావరణంలో, ప్రకృతితో మమేక మవ్వాలనుకునేవారికి ఇది నిజంగా స్వర్గ ధామం అంటున్నారు. ప్రపంచానికి, ముఖ్యంగా మగవారికి దూరంగా నచ్చినట్లుగా, స్వేచ్ఛగా గడపాలనుకునే మహిళలు అక్కడికి వెళ్తున్నారు. వారంతా మనసు విప్పి స్వేచ్ఛగా మాట్లాడు కుంటూ, ఆలోచనల్ని పంచుకుంటూ... అక్కడి నుంచి తిరిగి వచ్చే లోపు తమని తాము కొత్తగా ఆవిష్కరించు కుంటారట.
ఈ వార్తను కూడా చదవండి: ఎడారిలో పూల ఏరులు
కుకింగ్ నుంచి డైవింగ్లో శిక్షణ వరకు.. అన్ని కార్యకలాపాలు మహిళలే నిర్వహిస్తారు. అతిథులను హార్బర్కు తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు, కూరగాయలు సరఫరా చేసే మహిళా రైతులు, ఫొటోగ్రాఫర్లు... ఇలా దీవి మొత్తం మహిళలే కనిపిస్తారు.
ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో 4 భారీ క్యాబిన్లు, 3 మినీ క్యాబిన్లు ఉన్నాయి. వీటిని స్కాండినేవియన్ శైలిలో పర్యావరణహితంగా నిర్మించడం విశేషం. ఒక క్యాబిన్లోని షేరింగ్ గదిలో 5 రోజుల వసతికి 3 వేల నుంచి 6 వేల డాలర్లు ఖర్చు అవుతాయి. అంటే మన కరెన్సీలో సుమారు రెండున్నరలక్షల నుంచి 5 లక్షల రూపాయలన్నమాట. కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా మన దగ్గరి నుంచి సంపన్న మహిళలు వెళ్తున్నారు.
నోరూరించే అన్ని రకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడికి వచ్చే టూరిస్టులు స్వయంగా వంట చేసుకోవాలనుకున్నా అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సహజసిద్ధంగా లభించే కూరగాయలే వంటకు ఉపయోగిస్తారు. ఆల్కహాల్ పూర్తిగా నిషేధం. ఈ ఎకో- ఫ్రెండ్లీ దీవిలో సౌరశక్తితో నడిచే టాయిలెట్లను వినియోగిస్తున్నారు.

ఈ ద్వీపంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే మహిళలను అనుమతిస్తారు. ఈ దీవిని సందర్శిం చాలనుకుంటే.. ముందుగా ఆసక్తిగల మహిళలు ‘సూపర్షీ ఆర్గనైజేషన్’ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఫారమ్లో ‘ఈ ద్వీపాన్ని ఎందుకు సందర్శించాలనుకుంటున్నారు? ఒంటరిగా గడపడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి?’ వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు నింపాల్సి ఉంటుంది.
ఆపై దరఖాస్తుదారుల్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి, కొంతమందికి మాత్రమే దీవిని సందర్శించడానికి అనుమతిస్తారు.
లేలేత సూర్యకిరణాలు పడుతున్న వేళ... సముద్రతీరంలోని ఇసుక తిన్నెల మీద పర్యాటకులకు ప్రతీరోజూ యోగా సెషన్ నిర్వహిస్తారు. ఆపై ధ్యానం, ఫిట్నెస్, కుకరీ తరగతులు, ప్రకృతి పరిరక్షణ వంటి అనేక వెల్నెస్ కార్యక్రమాలుంటాయి. మహిళా సాధికారత, ఆరోగ్యం వంటి అంశాలపై నిపుణుల ఆధ్వర్యంలో సెమినార్లు నిర్వహిస్తారు. కాస్త విశ్రాంతి కోరుకునేవారి కోసం స్పా, సౌనా బాత్, ఫేషియల్స్, ఫారెస్ట్ బాత్ వంటి అనేక రకాల సౌకర్యాలున్నాయి. సాహస క్రీడల్లో కూడా పాల్గొనవచ్చు.
ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీ నుంచి సుమారు 160 కి.మీ దూరంలో, బాల్టిక్ సముద్రంలో ఈ దీవి 8.4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హెల్సింకీ నుంచి బోటు లేదా హెలికాప్టర్లో తీసుకెళ్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత
చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..
సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త
Read Latest Telangana News and National News