Share News

సీఎం రేవంత్‌తో హరీశ్‌రావు భేటీ

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:12 AM

శాసనసభ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ అగ్రనేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.

సీఎం రేవంత్‌తో హరీశ్‌రావు భేటీ

  • పద్మారావుగౌడ్‌తో కలిసి సీఎం చాంబర్‌కు..

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ అగ్రనేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ కూడా పాల్గొన్నారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌ ఇందుకు వేదికైంది. దాదాపు అరగంటపాటు వీరి భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే సికింద్రాబాద్‌ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం పద్మారావు పిలిస్తే తాను వెళ్లానని సీఎంతో భేటీ అనంతరం మీడియాతో హరీశ్‌రావు అన్నారు. కాగా, సీఎం చాంబర్‌ నిండా విజిటర్లు ఉండడంతో 15 నిమిషాలు తామేమీ మాట్లాడలేక పోయామని పద్మారావుగౌడ్‌ తెలిపారు. భేటీ సందర్భంగా తన నియోజకవర్గంలో కేసీఆర్‌ మంజూరు చేసిన హైస్కూలు, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని కోరామన్నారు. ఇదిలా ఉండగా.. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడంలేదని సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబసమేతంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన చాంబర్‌లో కలిశారు. అయితే తమ మెడికల్‌ కాలేజీ సీట్ల పెంపు కోసమే తాము సీఎంను కలిశామని మల్లారెడ్డి అల్లుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మీడియాతో అన్నారు.


సూర్యాపేట జిల్లా నేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణ, వరంగల్‌లో చేపట్టనున్న భారీ బహిరంగ సభ, ఇతర అంశాలపై ఆయన మాట్లాడారు. పార్టీ రజతోత్సవాలను విజయవం తం చేసేందుకు గులాబీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులతో త్వరలోనే సమావేశం కానున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్‌కుమార్‌, సునీతా మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 04:12 AM