చిన్నారులు అన్ని రంగాల్లో ముందుండాలి
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:19 AM
చిన్నారులు అన్ని రంగాల్లో ముందుండాలని డీఈవో జనార్దనరావు అన్నారు. బాలభవన్లో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 అంశాల్లో ఇచ్చే శిక్షణను బాల బాలికలు వినియోగించుకోవాలని అన్నారు.
కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు అన్ని రంగాల్లో ముందుండాలని డీఈవో జనార్దనరావు అన్నారు. బాలభవన్లో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 అంశాల్లో ఇచ్చే శిక్షణను బాల బాలికలు వినియోగించుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కవ నేర్చుకునే ప్రయత్నం చేయాలని, ఏదో ఒక అంశంలో నైపుణ్యం సాధించాలని తెలిపారు. బాలభవన్ సూపరెండెంట్ కట్ట మంజులాదేవి మాట్లాడుతూ 5 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు అబాకస్, కర్రసాము, శాస్త్రీయ నృత్యం, యోగ, చెస్, మృదంగం, నృత్యం, సంగీతం, మెహందీ, ఆర్ట్ అండ్ క్రాప్ట్, డ్రాయింగ్ అంశాల్లో శిక్షణ పొందవచ్చన్నారు. ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో తీసుకురావాలని తెలిపారు. శుక్రవారం నుంచి శిక్షణ తరగతులుంటాయని, ఈ యేడు కర్రసాము కూడా నేర్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శిక్షకులు రాధిక, రాజేందర్, సుహాసిని, మల్లిక, అనూప్, శ్రీధర్, సంగెం రాధాకృష్ణ, మంజులాదేవి, సూర్యశ్రీ, కృష్ణకుమార్, ఆయా నీలమ్మ పాల్గొన్నారు.