ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఇబ్బందులు తొలగించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:12 AM
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఇబ్బందులు తొలగించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం నగరంలోని ముకరంపురలోగల భవిత సెంటర్ను అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి సందర్శించారు.
కరీంనగర్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఇబ్బందులు తొలగించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం నగరంలోని ముకరంపురలోగల భవిత సెంటర్ను అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లు వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా చూడాలని ఆదేశించారు. పిల్లలు అన్నిరంగాల్లో రాణించేలా భవిత సెంటర్లు దోహదపడాలన్నారు. భవిత సెంటర్లలో వాల్ పెయింటింగ్స్, ప్లే వే మెటీరియల్ ఏర్పాటు చేయడంతోపాటు చదువుకోవడానికి, ఆటలాడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. పిల్లల్లో మానసిక స్థయిర్యం పెంపొందించేందుకు అన్నివిధాలా అధికారులు తోడునీడగా ఉండాలని పేర్కొన్నారు. సొంత బిడ్డల్లాగా వారిని చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 16 భవిత సెంటర్లను ఆధునికీకరించే పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆయా సెంటర్ల అభివృద్ధి కోసం నిరంతరం ముందుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర కో-ఆర్డినేటర్ రాంబాబు, జీసీడీవో కృపారాణి, ప్లానింగ్ కో-ఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.