రైతు నాయకులను జైలుకు పంపడం అప్రజాస్వామికం
ABN , Publish Date - Mar 28 , 2025 | 10:51 PM
రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన నాయకులను అరెస్టులు చేసి జైలుకు పంపడం అప్రజాస్వామికమని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన, ధర్నా చేపట్టారు.

- సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన, ధర్నా
నారాయణపేటరూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన నాయకులను అరెస్టులు చేసి జైలుకు పంపడం అప్రజాస్వామికమని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్, సీపీఐఎంఎల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కొండ నర్సిములు, కె.కాశీనాథ్, జి.వెంకట్రామారెడ్డి, బి.యాదగిరిలు మాట్లాడుతూ గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తున్న నాయకులతో కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు ఓపక్క చర్చలు జరుపుతూనే మరోపక్క అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. రైతు సంఘాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలన్నారు. అరెస్టు చేసిన నాయకులను విడిచిపెట్టి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు నారాయణ, అశోక్, బాల్రాం, వెంకట్రాములు, చెన్నప్ప, అంజి, జోషి, వెంకటేశ్, కాశన్న తదితరులున్నారు.