రైతుల కల్పతరువు భూ భారతి
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:27 PM
రైతులకు కల్పతరువు భూ భారతి చట్టం అని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.
- నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి
కోయిలకొండ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : రైతులకు కల్పతరువు భూ భారతి చట్టం అని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీరామకొండ మైదానంలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సును కలెక్టర్ విజయేందిర బోయితో కలసి ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దాన్ని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టం తీసుకొచ్చారన్నారు. భూ భారతితో రైతులు తహసీల్దార్ సమక్షంలోనే భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అన్నారు. తర్వలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ ప్రజావాణిలో భూ సమస్యలపైనే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, ఆ సమస్యలన్ని భూ భారతి ద్వారా తీరుతాయన్నారు. అంతకుముందు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీవో నవీన్, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ రాజాగణేష్, ఎంపీడీవో కాళప్ప, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విద్యాసాగర్గౌడ్, కాంగ్రెస్ నాయకుడు సత్యపాల్రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విక్రంతేజగౌడ్ పాల్గొన్నారు.