Share News

భూసమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:41 AM

భూ సమస్యల సత్వర పరిష్కారానికి ‘భూభారతి’ పరిష్కారం చూపుతుందని రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యుడు భూమి సునిల్‌ అన్నారు.

భూసమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’

రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

భూదాన్‌జయంతి వజ్రోత్సవాలు ప్రారంభం

భూదాన్‌పోచంపల్లి, ఏపిల్ర్‌ 18 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల సత్వర పరిష్కారానికి ‘భూభారతి’ పరిష్కారం చూపుతుందని రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యుడు భూమి సునిల్‌ అన్నారు. శుక్రవారం భూదాన్‌ జయంతి వజ్రోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ చైర్మన్‌ గున్న రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘భూభారతి చట్టం’పై అవగాహన సదస్సులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూభారతి చట్టం 100 ఏళ్ల వరకు భూ సమస్యలు లేకుండా చేస్తుందన్నారు. రైతుల పక్షపాతిగా, వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి భూభారతి చట్టం అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు ధరణి పోర్టల్‌ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. అనంతరం పోచంపల్లి మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జై బాపు, జై బీమ్‌, జై సంవిధాన్‌ పాదయాత్రను ప్రారంభించారు. నేతాజీ చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో జై బాపూ, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.

అనంతరం భూదాన్‌పోచంపల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో జలాల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేదని, ప్రైవేట్‌ స్థలాన్ని లీజుకు తీసుకుని నడిపారన్నారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి జలాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రానికి మొట్టమొదటి సారిగా ఐదున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. కార్యక్రమాల్లో రైతు కమిషన్‌ సభ్యులు భవానిరెడ్డి, కడియం పరమేశ్వర్‌, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి, ప్రొఫెసర్‌ తడక యాదగిరి, నాయకులు తడక వెంకటేష్‌, పాక మల్లే్‌షయాదవ్‌, భారత లవకుమార్‌, కందాడి భూపాల్‌రెడ్డి, సామ మోహన్‌రెడ్డి, మద్ది అంజిరెడ్డి, దానయ్య, లాలయ్య, కొట్టం కరుణాకర్‌రెడ్డి, బోగ భానుమతి విష్ణు, ఏలె భిక్షపతి, మెరుగు శశికళ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:41 AM