వడగండ్ల నష్టానికి పరిహారం చెల్లించాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:03 AM
మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగండ్లతో వరి పంట నేలపాలై నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఆత్మకూరు(ఎస్), ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగండ్లతో వరి పంట నేలపాలై నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని పాతర్లపహాడ్ గ్రామ స్టేజీ వద్ద బుధవారం వారు రాస్తారోకో నిర్వహించారు. ఈదురుగాలులు, వడగండ్లతో పంట నష్టపోయినా అధికారులు కనీసం స్పందించడంలేని ఆరోపించారు. ఇస్తాళాపురం, పాతర్లపహాడ్, ముక్కుడుదేవులపల్లి, కొత్తతండా, బోరింగ్ తండ గ్రామాల పరిధిలోని సుమారు రెండువేల ఎకరాలకు పైగా వరి పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనులో రాలిన ధాన్యాన్ని కనీసం పరిశీలించేందుకు అధికారులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్చేశారు.రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు రాస్తారోకో వద్దకు రావాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రాస్తారోకోతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఆర్ఐ స్వప్న, మండల వ్యవసాయాధికారి దివ్య తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో రైతులు మర్రు లక్ష్మణ్రావు, కప్పల నాగయ్య, కం చర్ల సత్తిరెడ్డి, బీసు కంట్లం, ఇరుగు బాబు, గంధం రమణ, నారగాని లింగయ్య, ఇర్మయ్య, మున్న గణేష్, శ్రీను, ఉపేందర్ పాల్గొన్నారు.