భూమిపై రైతుకే సర్వ హక్కులు
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:34 AM
భూమిపై రైతుకే సర్వహక్కులు కల్పించేందుకు భూభారతి చట్టం తెచ్చామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. భూభారతిపై మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.
అందుకే భూభారతి చట్టం తెచ్చాం
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
ఆత్మకూరు (ఎం), ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): భూమిపై రైతుకే సర్వహక్కులు కల్పించేందుకు భూభారతి చట్టం తెచ్చామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. భూభారతిపై మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయిలయ్య మాట్లాడుతూ భూమికి, రైతుకు ఆత్మీయ సంబంధం ఉందని, భూ సమస్యలు పరిష్కారంచేసి, రైతుకు భరోసా కల్పించడానికి సీఎం రేవంత్రెడ్డి భూభారతి చట్టాన్ని తెచ్చారని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’ అన్నదమ్ములు, కుటుంబసభ్యుల మధ్య చిచ్చు పెట్టిందని, అది కేవలం దోపిడీ దొంగలకు మాత్రమే ఉపయోగపడినట్లు ఆరోపించారు. భూభారతిపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన డీసీసీబీ ఆత్మకూరు(ఎం) నూతన శాఖ(బ్యాంక్)ను ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివా్సరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలకేంద్రంలో డీసీసీబీ నూతనశాఖను ఏర్పాటు చేసుకోవడం మండల రైతులు, ప్రజలు, వ్యాపారవేత్తలకు మంచి శుభపరిణామమన్నారు. వినియోగదారులు అధిక సంఖ్యలో ఖాతాలు తీసుకొని బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని చైర్మన్ కుంభం శ్రీనివా్సరెడ్డి కోరారు. అనంతరం మండలకేంద్రంలో కూరెళ్ల అనిల్ ఇంట్లో సన్నబియ్యంతో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి భోజనం చేశారు. అనంతరం మండలకేంద్రంతోపాటు కొరటికల్, పల్లెపహాడ్ గ్రామాల్లో కమ్యూనిటీహాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ దయాకర్రెడ్డి, మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రాజారామ్, తహసీల్దార్ వి.లావణ్య, ఎంపీడీవో రాములునాయక్, శేఖర్రెడ్డి, బి.నర్సింహ, పి.వినోద పాల్గొన్నారు.
బీటీరోడ్లు నిర్మించడమే లక్ష్యం
ఆలేరు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఆలేరు నియోజకవర్గంలో దెబ్బతిన్న బీటీరోడ్లను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణాలు చేపడుతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చెప్పారు. ఆలేరు మునిసిపల్ పరిధిలో బహదూర్పేట నుంచి గొలనుకొండ వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభించి మాట్లాడారు. రవాణా సౌకర్యం మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర రాజు, ఎంఏ ఎజాజ్, నాయకులు ఎం.శ్రీకాంత్, వట్టిపల్లి శ్రీనివాస్, అంగడి ఆంజనేయులు, సిద్దిరాజు కూళ్ల సిద్దులు పాల్గొన్నారు.