యూఏఈలో 13 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-01-13T15:05:24+05:30 IST
కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు 12.75 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ డోస్లను వేసింది.
దుబాయి: కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు 12.75 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ డోస్లను వేసింది. ఈ సందర్భంగా దుబాయి రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ఈ ఘనతను సాధించినందుకు ఫ్రంట్లైన్ సిబ్బందిని ప్రశంసించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడేందుకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. ‘కరోనా మహమ్మారిని యూఏఈ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. వ్యాక్సిన్ రేసులో ఉన్న దేశాల్లో యూఏఈ రెండో స్థానంలో నిలిచింది. నేను మీ అందరికి చెప్పేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రండి. వ్యాక్సిన్ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుతుంది. దేశం మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని ఆయన అన్నారు. కాగా.. యూఏఈలో ఇప్పటివరకు మొత్తం 2,36,225 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 717 మంది మృత్యువాతపడ్డారు.