వైద్య రంగానికి రెండేళ్లలో..రూ.10 వేల కోట్లు

ABN , First Publish Date - 2021-06-15T08:35:35+05:30 IST

రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రభుత్వం వైద్య రంగంపై రూ. 10 వేల కోట్లు ఖర్చుచేయనుంది.

వైద్య రంగానికి రెండేళ్లలో..రూ.10 వేల కోట్లు

  • తాజా బడ్జెట్‌ 6,295 కోట్లకు ఇది అదనం
  • మారనున్న వైద్యరంగం రూపురేఖలు

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రభుత్వం వైద్య రంగంపై రూ. 10 వేల కోట్లు ఖర్చుచేయనుంది. ఇటీవలి బడ్జెట్‌(2021-22)లో కేటాయించిన రూ. 6,295 కోట్ల నిధులకు ఇవి అదనం. రెండేళ్లలో వైద్య కళాశాలలు, మల్టీ స్పె షాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, డయాగ్నస్టిక్‌ కేంద్రా లు, జిల్లాల వారీగా కేన్సర్‌కేర్‌ యూనిట్లు, రక్తనిధి కేంద్రాల ఆధునికీకరణ, మాతాశిశు సంరక్షణ కేం ద్రాల ఏర్పాటుకు రెండేళ్లలో రూ. 10 వేల కోట్లను వెచ్చించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలను వికేంద్రీకరించనున్నట్లు తెలిపారు.


కొత్త వైద్య కళాశాలలకు పెద్దపీట

రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలతోపాటు నర్సింగ్‌  కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మెడికల్‌ కాలేజీకి రూ. 500 కోట్లు, నర్సింగ్‌ కాలేజీకి రూ.50 కోట్ల ఖర్చు అంచనాతో వైద్య ఆరోగ్యశాఖ డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు(డీపీఆర్‌) సిద్ధం చేసింది. ఏడు కాలేజీలకు కలపి రూ. 3,850 కోట్ల ఖర్చవుతుందని అంచనా.  


ఒక్కో బెడ్‌కు రూ.70 లక్షలు 

టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వ హయంలో హైదరాబాద్‌కు నాలుగువైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని ప్రకటించింది. ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత వాటి జోలికి వెళ్లలేదు. కరోనాకల్లోలం తర్వాత గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను టిమ్స్‌ ఆస్పత్రిగా సర్కారు తీర్చిదిద్దింది. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని మల్టీ సూపర్‌ స్పెషాలిటీగా మార్చాలని నిర్ణయించింది. వరంగల్‌ జైలును అక్కడినుంచి తరలించి, ఆ స్థానం లో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామ ని వరంగల్‌ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మార్చుతామన్నారు. ప్రస్తుతం ఎంజీఎంలో వెయ్యి పడకలున్నాయి. జైలు ప్రదేశంలో కొత్తగా నిర్మించే ఆస్పత్రిని దాదాపు 1,500 పడకలతో నిర్మించే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. చెస్ట్‌ ఆస్పత్రిలో 1,000 పడకలతో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ప్రస్తుతం మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రి నిర్మాణంలో ఒక్కో బెడ్‌కు 70 లక్షల మేర ఖర్చవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో 30ు ఐసీయూ బెడ్స్‌ ఉంటాయి. వరంగల్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో రెండింటికీ కలిపి.. 2,500 పడకలతో ఆస్పత్రుల నిర్మాణానికి 1,750 కోట్లు కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారు.


మరో రూ.4400 కోట్ల కేటాయింపులు ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కేన్సర్‌ కేర్‌ యూని ట్లు ఏర్పాటు చేస్తారు. వీటికి ఒక్కోదానికి రూ.1.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇలా 23 కేన్సర్‌ కేర్‌ యూనిట్లకు రూ.30 కోట్లు ఖర్చు కానున్నాయి.


మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటులో భాగంగా.. 50 పడకల ఆస్పత్రికి రూ.11 కోట్లు, 100 పడకల దవాఖానాకు రూ.17 కోట్లు, 200 పడకల కు రూ.55 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతానికి సూర్యాపేటలో 200పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. దీనికి రూ.55 కోట్లు, మధిర, సత్తుపల్లిలో మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు కలిపి రూ.34 కోట్లు కేటాయిస్తారు.


ప్రస్తుతం 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఉన్నాయి. మరో 16 చోట్ల కొత్తవాటిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ. 2.5 కోట్లు ఖర్చవుతుంది. దీనికి రూ.40 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీంతోపాటు.. అన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో సీటీస్కాన్‌, ఈసీజీ, డిజిటల్‌ ఎక్స్‌రే, అలా్ట్రసౌండ్‌, టూడీ ఎకో, కేన్సర్‌ స్ర్కీనింగ్‌కు మోమోగ్రామ్‌ పరికరాలను సమకూర్చనున్నారు. వీటిలో ఒక్క సీటీస్కాన్‌కే రూ.2 కోట్లు, ఈసీజీకి రూ.5 లక్షలు, ఎక్స్‌రే యంత్రానికి రూ. 25-30 లక్షలు, 2డీ ఎకో యంత్రానికి కోటి రూపాయ లు, అలా్ట్రసౌండ్‌(అడ్వాన్డ్స్‌)కు 10లక్షలు, మోమోగ్రామ్‌ పరికరానికి రూ.30 లక్షలు వెచ్చిస్తారు. అన్ని కేం ద్రాల్లో వీటి కొనుగోలుకు రూ.130 కోట్లు అవసరమని అంచనా.


ప్రభుత్వ ఆస్పత్రుల అవసరాలను తీర్చేలా బ్లడ్‌ బ్యాంకులను ఆధునికీకరించడం, అవసరమైన చోట కొత్తవాటిని ఏర్పాటు చేయాలని ఇటీవలి కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 57 బ్లడ్‌ బ్యాంకులున్నాయి. వాటిలో 26 బ్లడ్‌ బ్యాంకులను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఒక్కో కేంద్రానికి రూ.3 కోట్ల వరకు ఖర్చుకానుంది. ఇలా రక్తనిధి కేంద్రాల ఆధునికీకరణకు రూ.75 కోట్లను వెచ్చిస్తారు.


మధిర, సత్తుపల్లిలో కొత్తగా 100 పడకల ఆస్పత్రులను నిర్మించనున్నారు. ఈ రెండిటికీ కలిపి రూ.50-60 కోట్లు ఖర్చవుతుందని అంచనా.


ప్రస్తుతమున్న 49 డయాలసిస్‌ కేంద్రాలకు అదనంగా మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి పెద్దమొత్తంలో ఖర్చుకానుంది.

Updated Date - 2021-06-15T08:35:35+05:30 IST