బ్యాంకులో ఎఫ్డీ వేసిన ఎన్ఆర్ఐ.. ఇక డబ్బు ఎక్కడికీ పోదనుకుంటే.. ఇలా ఊహించని విధంగా..
ABN , First Publish Date - 2021-10-22T03:59:50+05:30 IST
ఐసీఐసీఐ బ్యాంకులో 1.35 కోట్లను ఎఫ్డీ వెసిన ఓ ఎన్నారై మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆమె డబ్బుపై కన్నేసిన ఓ బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరగాళ్లతో కలిసి మొత్తం అకౌంట్ను ఖాళీ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీఐసీఐ బ్యాంకులో 1.35 కోట్లను ఎఫ్డీ వెసిన ఓ ఎన్నారై మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆమె డబ్బుపై కన్నేసిన ఓ బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరగాళ్లతో కలిసి మొత్తం అకౌంట్ను ఖాళీ చేశాడు. చివరిగా మిగిలిన రూ. 67ను కూడా వదలకుండా మొత్తం డబ్బును దోచుకుపోయాడు. దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. కనికా గిరిధర్ అనే మహిళా ఎన్నారై ఆ బ్యాంకులో కోటికి పైగా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఎఫ్డీ చేసే సందర్భంలో కేవైసీ నిబంధనల ప్రకారం.. తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఆ తరువాత.. ఎఫ్డీ విషయాన్ని మర్చిపోయారు. ఈ క్రమంలో ఆమె అకౌంట్పై బ్యాంకు ఉద్యోగి సుమిత్ పాండే కన్నుపడింది. దీంతో.. అతడు ఈ ఖాతా వివరాలను సైబర్ నేరగాడు శైలేంద్ర ప్రతాప్ సింగ్కు ఇచ్చాడు. ఈ ఖాతా వివరాల్లో పేర్కొన్న నెంబర్ 90 రోజులుగా వినియోగంలో లేకపోవడంతో అది వేరే వారికి ట్రాన్సఫర్ అయిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న నిందితులు..ఆ నెంబర్ను తమ పేర తీసుకున్నారు.
ఆ తరువాత.. నీలమ్ అనే యువతిని కనికగా బ్యాంకు వారికి పరిచయం చేసి..ఎఫ్డీని వెనక్కు తీసుకున్నారు. అంతేకాకుండా.. కొత్త ఏటీఎం కార్డు, పాస్బుక్ కూడా పొందారు. ఆ తరువాత.. ఓ నకిలీ కంపెనీ ఏర్పాటు చేసి అందులో కొందరు కార్మికులను చేర్చుకుని వారి పేరిట బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేశారు. అనంతరం..కనికా అకౌంట్లోని నిధులను కొద్ది కొద్దిగా వీరి అకౌంట్లలోకి ట్రాన్సఫర్ చేసి..ఆ డబ్బంతా తీసేసుకున్నారు. చివరిగా రూ. 67 మిగలగా.. ఏటీఎం నుంచి విత్డ్రా చేయడం కష్టంగా మారింది. దీంతో.. వారు కనికా అకౌంట్లో మరో రూ. 37 జమ చేసి అకౌంట్లో మొత్తం రూ. 100 చేరేలా చేశారు. ఆ తరువాత.. ఏటీఎం ద్వారా ఆ వందని కూడా డ్రా చేసుకున్నారు. ఇటీవల తన అకౌంట్లో పైసా కూడా లేదని తెలుసుకున్న ఎన్ఆర్ఐ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు నిందితులను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.