రోడ్ల మరమ్మతులకు 2 వేల కోట్ల రుణాలు!
ABN , First Publish Date - 2021-04-13T09:47:24+05:30 IST
రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.2 వేలకోట్ల రుణాన్ని తక్కువ వడ్డీకే తీసుకునేలా దిశానిర్దేశం చేస్తూ రోడ్లు భవనాల శాఖ
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.2 వేలకోట్ల రుణాన్ని తక్కువ వడ్డీకే తీసుకునేలా దిశానిర్దేశం చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వంపై తక్కువ భారం పడేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 7.5-7.9 శాతంలోపే వడ్డీకి రుణాలు తీసుకోవాలని ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీఆర్డీసీ(ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థ), ఏపీఅర్బన్(ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనెజ్మెంట్ లిమిటెడ్) సంస్థలు ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరపాలని పేర్కొన్నారు.
వడ్డీరేట్లపై ప్రభుత్వం నుంచి తుది ఆమోదం తీసుకోవాలని ఏపీఆర్డీసీ చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. కాగా, లీటరు పెట్రోల్, డీజిల్పై వాహనదారుల నుంచి వసూలు చేస్తోన్న ఒక్క రూపాయి సెస్లో 50 శాతం(50 పైసలు) ఎస్ర్కొ అకౌంట్ కింద ఏపీఆర్డీసీకి అందించనున్నారు. ఆ మొత్తాన్ని వనరుగా చూపి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రహ దారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.