నకిలీ ట్రేడింగ్ యాప్తో 20 లక్షలు స్వాహా
ABN , First Publish Date - 2021-04-11T08:16:35+05:30 IST
నకిలీ ఆన్లైన్ ట్రైడింగ్ యాప్ను సృష్టించి.. అమాయకులను మోసగిస్తున్న బెంగళూరుకు చెందిన సైబర్క్రైమ్ ముఠా ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు.
- నగర మహిళకు కుచ్చుటోపీ
- బెంగళూరు ముఠా ఆటకట్టు
- దా‘రుణాల’ నుంచి ట్రేడింగ్కు
- మోసగాళ్ల నయా దందా
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): నకిలీ ఆన్లైన్ ట్రైడింగ్ యాప్ను సృష్టించి.. అమాయకులను మోసగిస్తున్న బెంగళూరుకు చెందిన సైబర్క్రైమ్ ముఠా ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు. శనివారం పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 24న ఓ మహిళకు హాంకాంగ్కు చెందిన మొబైల్ నంబరు నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ‘విన్బిజ్’ అనే ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడులు పెడితే.. తక్కువ సమయంలో రెండు, మూడింతల లాభాలు వస్తాయని అందులోని సారాంశం. ఆసక్తిగల వారు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఆ మెసేజ్లో ఓ లింకు ఉంది. ఇది నిజమని నమ్మిన ఆ మహిళ.. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. తొలుత ఆమె రూ. 500 పెట్టుబడి పెట్టారు. వారం రోజుల్లో రూ. 2,000 లాభాలు వచ్చినట్లు యాప్లో కనిపించింది. దీంతో.. రూ. 5,000 పెట్టుబడి పెట్టారు.
వారంలో ఆమె బ్యాలెన్స్ రూ. 10 వేలు అయ్యింది. ఆ తర్వాత ఆమె పెట్టుబ డి పెంచుకుంటూ పోయారు. చివరికి రూ. 20 లక్షలు పెట్టారు. యాప్లో తన లాభాలను కలుపుకొని మొత్తం నిల్వ రూ. 54.39 లక్షలుగా కనిపించడంతో.. ఎగిరి గంతేశారు. ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందు కు యత్నించగా.. ఆ ఆప్షన్ లేదు. అనుమానంతో యాప్లో పేర్కొన్న ఫోన్ నంబర్లు, తనకు వాట్సాప్ వచ్చిన నంబరుకు కాల్ చే యగా.. స్విచాఫ్ చేసి ఉన్నాయి. దీంతో ఆమె సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్స్ డీసీపీ యాదగిరి, అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ బృందం.. సాంకేతిక ఆధారాల తో కేసు దర్యాప్తు ప్రారంభించింది. సైబర్ నేరగాళ్లు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి.. ఓ ప్రత్యేక బృందం వెళ్లింది. అక్కడ అశోక్కుమార్ ఆర్ముగం, కంచి సంజిత్కుమార్, ఆసిమ్ అక్తర్లను అరెస్టు చేసింది. కాగా.. నిందితులంతా ఇంతకు ముందు హాంకాంగ్ కేంద్రంగా దా‘రుణాల’ యాప్లను నిర్వహించేవారని పోలీసులు గుర్తించారు. ఇన్స్టంట్ లోన్ యాప్లపై పోలీసుల నిఘా పెరగడంతో నకిలీ ట్రేడింగ్ యాప్లతో దం దాలకు పాల్పడుతున్నారని నిర్ధారించారు. ఇంకా ఈ ముఠా ఉచ్చులో ఎంతమంది చిక్కారనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని మహేశ్ భగవత్ తెలిపారు.